కళ్ల ముందు ప్రమాదం కనిపిస్తున్నా అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే రహదారిలో శిథిలావస్థకు చేరిన వంతెన వాహనదారులను భయపెడుతోంది. మాయలూరు – ఆళ్లగడ్డ ఆర్అండ్బీ రహదారిలో ఇంజేడు గ్రామ సమీపంలో కుందరవాగుపై ఉన్న దశాబ్దాల కాలం నాటి వంతెన శిథిలావస్థకు చేరుకుంది. అప్పుడో ఇప్పుడో కూలేందుకు సిద్ధంగా వుంది. వంతెనకు ఇరు వైపులా గ్రిల్ లేకపోవడంతో వదర నీరు పైకెక్కి ప్రవహించే సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రహదారిలో ఆళ్లగడ్డ నుంచి తాడిపత్రి, కోవెలకుంట్ల, తిరుపతి, తదితర పట్టణాలకు ఆర్టీసీ బస్సులు, లారీలు నిత్యం వందల సంఖ్యలతో వాహన చోదకులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు వంతెన దాటే సమయంలో భయాందోళనకు గురవుతున్నారు. శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. – ఉయ్యాలవాడ


