సమ్మోహనం.. జగన్మోహినీ రూపం
ఆళ్లగడ్డ: అమృతం అసురులపాలు కాకుండా లోక సంరక్షణ కోసం మహావిష్ణువు దాల్చిన జగన్మోహిని అవతారంలో నృసింహుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం వాడవాడల్లో సంచరిస్తూ.. భక్తులకు కనువిందు చేశారు. లోక కల్యాణార్థం ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన శుక్రవారం సింహరూపుడైన స్వామిని జగన్మోహినీ అలంకరణతో గడగడపకు వెళ్లారు. వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామిని యాగశాలలో కొలువుంచి నవకళశస్థాపన చేశారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంబరాలతో మోహినీ అలంకరణ చేశారు. పుష్పాలంకరణ పల్లకీలో కొలువుంచి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య వీధుల్లో సంచరించారు.
శరభవాహనంపై శ్రీహరి
సర్వాలంకార భూషితుడైన శ్రీహరి శరభ వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో వివహరించారు. ఈ వాహనసేవ శోభాయనంగా సాగింది. భక్తులు తరలివచ్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
పొన్నచెట్టు వాహనంపై
ఊరేగిన గోవిందుడు
శ్రీ అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన శుక్రవారం ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలా నృసింహస్వామి పొన్నచెట్టు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఉత్సవమూర్తులకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పుష్ప పల్లకీలో కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి శ్రీ జ్వాలా నృసింహుడు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం ( పొన్నచెట్టు వాహనం) అధిష్టించి భక్తజనులకు దర్శనమిచ్చారు.
అహోబిలంలో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శనివారం ఉదయం అభిషేకం, సాయంత్రం గజవాహన సేవ, రాత్రి తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దిగువ అహోబిలంలో ఉదయం వేణుగోపాల స్వామి అలంకారం, రాత్రి పొన్నచెట్టు వాహనంపై స్వామి వివహరించనున్నారు.
‘మోహినీ’ అలంకరణలో
సింహరూపుడు
దిగువ అహోబిలంలో మోహినీ
అవతారంలో సందడి చేసిన
ప్రహ్లాదవరదుడు
రాత్రి శరభ వాహనము పై
దర్శనమిచ్చిన స్వామి
ఎగువ అహోబిలం లో పొన్నచెట్టు
వాహనము పై దర్శనమిచ్చిన
జ్వాలనారసింహుడు


