ఇలా అయితే.. వంద శాతం కష్టమే!
● ఉపాధ్యాయుల తీరుపై డీఈఓ ఆగ్రహం
ప్యాపిలి: ఇలా ఉంటే పదోతరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం కష్టమేనని ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖాధికారి జనార్దనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని పీఆర్పల్లి, బూరుగల, సీతమ్మతండా, హుసేనాపురం, ప్యాపిలి జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పీఆర్ పల్లిలో స్టడీ అవర్స్కు 56 మందికి గాను 9 మంది విద్యార్థులు మాత్రమే ఉండటంతో డీఈఓ అసహనం వ్యక్తం చేశారు. ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు ఉపాధ్యాయుడు స్థానంలో సోషల్ స్టడీస్ టీచర్ ఉండటంపై మండిపడ్డారు.
జీఎన్ఎస్ఎస్ నుంచి నీటి విడుదల
బనగానపల్లె: గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు జీఎన్ఎస్ఎస్ ద్వారా సంబంధిత అధికారులు నీటిని గురువారం రాత్రి విడుదల చేశారు. కడప, చిత్తూరు మరి కొన్ని ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి సమస్య తీర్చేందుకు ఈ నీటిని అవుకు రిజర్వాయర్లోకి విడుదల చేశారు. రిజర్వాయర్ నుంచి వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్కు అక్కడి నుంచి ఇతర రిజర్వాయర్లకు నీరు చేరుతుంది. జీఎన్ఎస్ఎస్ ద్వారా అధికారులు సుమారు 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఉత్సవమూర్తులకు విశేష పూజలు
రుద్రవరం: పార్వేట ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులు శ్రీ జ్వాలానరసింహ స్వామి, శ్రీ ప్రహ్లాదవరదస్వామి గ్రామగ్రామానా ప్రజల నుంచి విశేష పూజలందుకుంటున్నారు. పార్వేట పల్లకీ శుక్రవారం మండల పరిధిలోని తిప్పారెడ్డిపల్లెకు చేరుకోవడంతో గ్రామపెద్దలు ఎదురేగి వెళ్లి స్వాగతించారు. అనంతరం బోయిలు స్వామి వారి పల్లకీని గ్రామంలోని పలు తెలుపుల మీద కొలువుదీర్చారు.
సప్తనదీ జలాలతో అభిషేకం
కొత్తపల్లి: మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సప్తనది సంగమేశ్వరంలోని ఎగువ పుష్కరఘాట వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. శివలింగానికి సప్తనదీ జలాలతో అభి షేకం చేశారు. కుంకుమార్చన, పుష్పార్చన, మంగళహారతి వంటి విశేష పూజకార్యక్రమాలు జరుపుకున్నారు. ఆలయం వద్ద భక్తులతో సందడి నెలకొంది.
వెల్లివిరిసిన సామరస్యం
ఆత్మకూరు: మహాశివరాత్రి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని శివాలయంలో పలువురు భక్తులు శివమాల ధరించి నిష్టతో పూజలు నిర్వహిస్తున్నారు. శివస్వాములపై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ పఠాన్వలిఖాన్ ఉదారత చాటారు. సుమారు 200 మంది శివస్వాములకు అవసరమైన అల్పాహారాన్ని తానే స్వయంగా తయారు చేయించారు. కేవలం ఆహారం అందించడమే గాకుండా ప్రతిఒక్క స్వామికి ఎంతో వినమ్రతతో స్వయంగా దగ్గరుండి వడ్డించి సోదరభావాన్ని చాటుకున్నాడు.
ప్రశాంతంగా బార్ ఎన్నికలు
నంద్యాల(వ్యవసాయం): ఏపీ స్టేట్ బార్ మెంబర్స్ ఎన్నికలు నంద్యాల బార్ అసోసియేషన్లో ప్రశాంతంగా ముగిశాయి. సీనియర్స్, జూనియర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బార్ అసోసియేషన్ పోటీ చేస్తున్న అభ్యర్థి విజయశేఖర్రెడ్డి ఓటును వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ ఆఫీసర్ హుసేన్బాషా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు హరిప్రసాదరెడ్డి, చిన్న సుదాంశమౌళిరెడ్డి, భూపని వెంకటేశ్వర్లు, కృపావతి, వెంకటప్రసాద్, తోట మురళీలు మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ కార్యాలయంలో 446 ఓటర్లు ఉండగా 419 ఓట్లు పోలయ్యాయన్నారు. 95 శాతం పోలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. 27 మంది గైర్హాజరయ్యారన్నారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇలా అయితే.. వంద శాతం కష్టమే!
ఇలా అయితే.. వంద శాతం కష్టమే!


