
హిందీ పరీక్షకు 356 మంది గైర్హాజర్
నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో మంగళవారం జరిగిన హిందీ పరీక్షకు 356 మంది గైర్హాజరైనట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. జిల్లాలో 35 పరీక్ష కేంద్రాల్లో 504 మంది విద్యార్థులకు గాను 148 మంది విద్యార్థులు (29.36) శాతం పరీక్షకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్, 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్ పరీక్ష నాలుగు కేంద్రాల్లో నిర్వహించగా 105 మంది విద్యార్థులకు గాను 86 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
నంద్యాల(న్యూటౌన్): తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో పని చేస్తున్న కెప్టెన్, డ్రైవర్స్కు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓ రవికుమార్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, బాలవెంకట్, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిషన్లు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలకు ఒక సారి కాకుండా ప్రతి నెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సీఐటీయూ అనుబంధ యూనియన్ అధ్యక్షుడు ఖాజా, రఫీ, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, ట్రెజరర్ సుభాన్, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, రసూల్, ఖాదర్, బాషా, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
తూనికలు, కొలతలపై అవగాహన
నంద్యాల(వ్యవసాయం): పంచ కొలతల దినోత్సవం సందర్భంగా స్థానిక రిటైల్ మర్చంట్ వ్యాపారస్తుల కార్యాలయంలో మంగళవారం తూనికలు, కొలతలపై వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ప్రకొలతల జిల్లా సహాయ అధికారి జిలాని బాషా ఆధ్వర్యంలో అవగామన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనాలన్నారు. ప్యాకేజీ వస్తువులపై ఎమ్మార్పీ, తయారీ తేదీలు తప్పక ప్రకటించి ఉండాలన్నారు.జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు న్యాయవాది అమీర్బాషా ఆహార పదార్థాలు, పెట్రోలు, బంగారు వస్తువుల విక్రయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డగాళ్ల మల్లికార్జున, అధికారులు అనిత, ఖాజా హుసేన్ నాగప్రసాద్ అల్లూరయ్య శ్రీనివాసు గుప్తా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం డిగ్రీ కళాశాలకు నాక్ గ్రేడ్
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ అక్రిడిటేషన్ కమిటీ ‘బి’ గ్రేడ్ను మంజూరు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్బాషా మంగళవారం తెలిపారు. కళాశాలలో బోధన, వసతులు, తరగతి గదులు, క్యాంటీన్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, పచ్చదనం, పరిశుభ్రత అంశాలను అక్రిడిటేషన్ కమిటీ పరిశీలించింది. అలాగే కళాశాల డెవలెప్మెంట్ కమిటీ, అలూమినీ అసోషియేషన్ సహకారం పరిగణలోకి తీసుకొని ‘బీ’ గ్రేడ్ను మంజూరు చేసింది. ఈ సందర్భంగా అలూమిని అసోసియేషన్ అధ్యక్షుడు సాల్మన్ మాట్లాడుతూ భవిష్యత్లో ‘ఎ’ గ్రేడ్ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని, అందుకు ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్ధులు సహకరించాలని కోరారు.

హిందీ పరీక్షకు 356 మంది గైర్హాజర్

హిందీ పరీక్షకు 356 మంది గైర్హాజర్