
యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
నంద్యాల(అర్బన్): వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. ఆదివారం స్థానిక టెక్కె మార్కెట్యార్డులో రైతులకు యంత్ర పరికరాలు రాయితీపై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రభుత్వం మద్దతు ధర కింద క్వింటా జొన్నలు రూ.3,371తో రైతుల నుంచి కొనుగోలు చేస్తుందన్నారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీఏఓ మురళీకృష్ణ మాట్లాడుతూ నంద్యాల మండలంలో 49 మంది రైతులకు, గోస్పాడు మండలంలో 35 మంది రైతులకు తైవాన్ స్పేయర్లు, రోటావేటర్లు, విత్తన గొర్రులు, గుంటికలు అందజేశామన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ మెంబర్ తులసిరెడ్డి, ఏడీఏ రాజశేఖర్, సివిల్ సప్లయ్ డీఎం రాజునాయక్, మార్క్ఫెడ్ డీఎం హరినాథరెడ్డి, ఏఓ ప్రసాదరావు, స్వప్నికారెడ్డి, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.