మిర్యాలగూడ అర్బన్ : స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు అని, అవి ప్రభుత్వాల బిక్ష కాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో వెయ్యిమంది విద్యార్థులతో మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉన్నత చదువుకు దూరం చేస్తోందన్నారు. ఆరేళ్లుగా రాష్ట్రంలో రూ.10,500 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని, హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కార్యదర్శులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


