నల్లగొండ టూటౌన్ : వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చి విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమస్యల మయంగా మారుతోంది. సమస్యలను పరిష్కరిస్తూ చిన్న, చిన్న ఘటనలు చోటుచేసుకున్న సమయంలోనే విద్యార్థులతో మాట్లాడి మరోసారి జరుగకుండా చూడాల్సిన యంత్రాంగం పంతానికి పోవడం.. బెదిరించే ధోరణిలో మాట్లాడడం..కీలకమైన బాధ్యతల్లో ఉన్న అధికారుల ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ విద్యార్థులు చేస్తున్న ధర్నాలతో యూనివర్సిటీ దద్దరిల్లుతోంది.
బాధ్యతారహితంగా సిబ్బంది
మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇటీవల చోటు చేసుకుంటున్న రూ.99 లక్షల జీఎస్టీ ఎగనామం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల అక్రమాలు, ఓ అధ్యాపకుడు విద్యార్థుల నుంచి వసూలు చేసి న పరీక్ష ఫీజు చెల్లించకుండా ఉండడం, అన్నంలో పురుగులు, తాగునీటిలో కప్పలు, చెత్తాచెదారం రావడంతో విద్యార్థులు ఫ్రిజ్ను ధ్వంసం చేయడం లాంటి వరుస ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఇన్ని జరుగుతున్నా.. హాస్టల్ నిర్వాహకులు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేన్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్ నిర్వహణ లోపాభూయిష్టంగా మారినా దానిని గాడిలో పెట్టే పనిచేయకుండా మిన్నకుండి పోవడంతోనే సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఉండడం లేదు.
ఆందోళనలు జరుగుతున్నా..
మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్లో పురుగుల అన్నం పెట్టారని, అన్నంలో గుట్కా ప్యాకెట్ వచ్చిందని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన దిగినా యూనివర్సిటీ బాధ్యులకు ఎలాంటి చలనం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీలోని కళాశాల వద్ద ఉన్న తాగునీటి ఫ్రిజ్లో జెర్రీ, కప్పలు, పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆందోళనకు దిగి దానిని ధ్వంసం చేసే వరకు తెచ్చుకున్నారు. ఇన్ని జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులకు ఎందుకు పట్టడంలేదని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
ఎనిమిది నెలలుగా సరఫరాకాని నీరు
ఎనిమిది నెలలుగా బాలికల హాస్టల్లో తాగునీరు, వాడుకునే నీరు సరిగా సరఫరా కాకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకోవాల్సిన వారు బెదింరింపు ధోరణితో వ్యవహరించడం వల్లే అర్ధరాత్రి ఆడపిల్లలు వైస్ ఛాన్స్లర్ అతిథి గృహం ముట్టడించారంటే సమస్య ఎంత జఠిలంగా ఉందో ఎవరికై నా అర్థమవుతోంది. కానీ యూనివర్సిటీల బాధ్యులు దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా తమకు మౌలిక వసతులు కల్పించి వివాదాలకు తెర దించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ధర్నాలతో దద్దరిల్లుతున్న ఎంజీయూ
ఫ అన్నంలో పురుగులు..
తాగునీటిలో కప్పలు, జెర్రులు
ఫ ఆందోళనలో విద్యార్థులు
ఫ దిద్దుబాటు చర్యలకు పూనుకోని
యూనివర్సిటీ యంత్రాంగం


