రామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు అన్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నల్లగొండ పట్టణంలో నిర్వహించారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి క్లాక్టవర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎస్. రావు మాట్లాడుతూ ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ నిర్బంధ కాలం నుంచి స్వతంత్రంగా ఆర్టీసీ కార్మిక సమస్యలపై, సంస్థ రక్షణ కోసం పోరాడిందన్నారు. 2021 నుంచి 9 సంఘాలతో జేఏసీ ఏర్పడి పనిచేసింది అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోర్మెన్ కమిటీ ముందు, ప్రభుత్వ మంత్రుల ఉప సంఘం ముందు విలీనం, అనంతర సమస్యలు, యూనియన్ పునరుద్ధరణ, ఉద్యోగ భద్రత, సర్వీస్ కండిషన్లు, పే స్కేల్ అలవెన్స్లపై వినతిపత్రాలు సమర్పించామన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరారెడ్డి మాట్లాడుతూ పనిభారం, వేధింపులు, యూనియన్ హక్కుల పునరుద్ధరణ కోసం ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా పోరాడి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. బస్సుల విధానం మార్పు చేసి, వాటిని ఆర్టీసీలకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి జి.లింగమూర్తి, ప్రచార కార్యదర్శి పి.రవీందర్ రెడ్డి, కోశాధికారి కేఎస్.రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గీత, ఎస్.కృష్ణ, ఈఏ.రాంచందర్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాస్, బియూ.చారి, బత్తుల సుధాకర్, నాయకులు నర్సింహ, రసూల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


