సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం 2022–23 యాసంగి సీజన్లో ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రామలక్ష్మణ్ రైస్ మిల్లు పేరు మారింది. అయితే సాధారణంగానే పేరు మార్చేశారా? లేదంటే మిల్లునే అమ్మేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు మిల్లుల ద్వారా రూ.100 కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఆ మిల్లు యజమాని కొండా లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించిన విషయం తెలిసిందే. ఆయనను ఆరెస్టు చేసి రిమాండ్కు పంపిన రోజే ఆయనకు సంబంధించి పానగల్ సమీపంలోని అద్దంకి బైపాస్ రోడ్డు ఉన్న రామ్లక్ష్మణ్ పారుబాయిల్డ్ మిల్లు పేరును రాజరాజేశ్వరి రైస్ మిల్లుగా పేరు మార్చి బోర్డు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ధాన్యం ఎగ్గొట్టిన వ్యవహారంలో ఆ మిల్లును అధికారులు సీజ్ చేయడం, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మిల్లు పేరు మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మిల్లునే ఆమ్మేయడం ద్వారా పక్కదారి పట్టించిన ధాన్యం డబ్బులను ఎగ్గొట్టేందుకు ఆ పని చేశారా? లేదంటే మరో పేరుతో మిల్లును నడిపించుకునేందుకు, మళ్లీ ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని వ్యాపారం చేసుకునేందుకు ఈ చర్యలకు దిగారా? అన్నది తేలాల్సి ఉంది.
ఫ రామ్లక్ష్మణ్ మిల్లు వద్ద రాజరాజేశ్వరి రైస్ మిల్ పేరుతో బోర్డు


