నల్లగొండ : వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండలస్థాయి అధికారులతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని చెప్పారు. ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. ధాన్యం కొన్న తర్వాత మిల్లులకు తీసుకువెళ్లే లారీలు, వాహనాలపై కూడా టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. పెట్రోల్, డీజిల్పై సమీక్షిస్తూ ఎక్కడా నో స్టాక్ బోర్డు పెట్టకుండా చూడాలన్నారు. సాదాబైనామా దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, తహసీల్దార్ స్థాయిలో ఉన్న అన్ని దరఖాస్తులు ఆర్డీఓ లాగిన్కి రావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.


