మిర్యాలగూడ టౌన్, రామగిరి (నల్లగొండ) : ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజూ కొనసాగింది. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు పట్టువీడకపోవడంతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం డిపోల ఎదుట ధర్నా నిర్వహించారు. నల్లగొండలో ఆర్టీసీ కార్మికులు డిపో నుంచి క్లాక్ టవర్ వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ చిత్రపటానికి డిపో ఎదుట, క్లాక్ టవర్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి డిపో ఎదుట ధర్నాలో పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు. మిర్యాలగూడలో డిపో నుంచి జాతీయ రహదారిపై రాజీవ్గాంధీ చౌరస్తా, అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి మాజీ ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి, సీపీఎం రాష్ట్ర నేత డబ్బీకార్ మల్లేష్, సీపీఐ జిల్లా నేత బంటు వెంకటేశ్వర్లు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నేత వస్కుల మట్టయ్య, తెలంగాణ జేఏసీ కన్వీనర్ మాలి ధర్మపాల్రెడ్డి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
385 బస్సులు నడిపిన యాజమాన్యం
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి బస్టాండ్లోనే వేచి చూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 385 బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడిపించింది. మిగతా బస్సులు డిపోకే పరిమితం అయయి. కేవలం ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే నడుస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో తమ ఇళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఏదైనా బస్సు వచ్చిందంటే అందులోకి ఎక్కడానికి తోపులాటలు జరుగుతున్నాయి. కాగా, మిర్యాలగూడ నుంచి భువనగిరికి వెళ్లే ఎలక్ట్రికల్ బస్సు ఎక్కే సమయంలో ఓ మహిళ బ్యాగులో నుంచి రూ.వెయ్యిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. మరో మహిళ బ్యాగులోని రూ.500 కొట్టేశారు.
ఫ పట్టు వీడని ఆర్టీసీ కార్మికులు
ఫ సమ్మెకు పెరుగుతున్న మద్దతు
ఫ మూడో రోజూ కొనసాగిన సమ్మె.. ప్రయాణికుల ఇబ్బందులు


