సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు (పీఏసీఎస్) కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. గత ఏడాది ఫిబ్రవరితో పాలకవర్గాల గడువు ముగిసినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఆ తరువాత ఒకసారి ఆరునెలలు గడువు పొడిగించింది. గత ఆగస్టు నెల నుంచి పీఏసీఎస్లు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. అయితే ఆయా పీఏసీఎస్లకు పాలకవర్గాలను నామినేట్ చేయాలని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే ఆయా పీఏసీఎస్లకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 107 పీఏసీఎస్లు, ఒక రైతు పరస్పర సహకార సంఘం (తుంగతుర్తిలో) ఉన్నాయి. వాటన్నింటికి త్వరలోనే కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేయనుంది. మరోవైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా నాగార్జున మార్కెటింగ్ సొసైటీలకు (ఎన్డీసీఎంఎస్) కూడా పాలకవర్గాలను నామినేట్ చేసే అవకాశం ఉంది. మొన్నటివరకు డీసీసీబీకి కుంభం శ్రీనివాస్రెడ్డి చైర్మన్గా కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 జూన్ 28వ తేదీన పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన చైర్మన్ అయ్యారు. అయితే ఆయన కొద్దికాలమే చైర్మన్గా పని చేయడం, ఆ కొద్ది కాలంలోనే బ్యాంకును లాభాల్లోకి తీసుకెళ్లినందున మళ్లీ ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది.
ఫ నామినేట్ చేయాలని నిర్ణయించిన మంత్రివర్గం
ఫ డీసీసీబీకి కూడా నామినేట్ చేసే అవకాశం


