భయాందోళనలో సిబ్బంది
నల్లగొండ : రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి చేరుకున్న అధికారులు, లోపలికి వెళ్లగానే తలుపులు మూసివేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విజిలెన్స్ సీఐ దశరథ, ఎఫ్ఆర్ఓ మనోహర్ నేతృత్వంలోని బృందం ఈ తనిఖీలు సాగాయి. సబ్ రిజిస్టార్లతోపాటు ఇతరుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులను అధికారులు గుర్తించారు. గతంలో అవుట్సోర్సింగ్ కింద పనిచేసిన వీరి కాలపరిమితి ముగిసినప్పటికీ, కార్యాలయంలో కొనసాగుతుండటంతో వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ దశరథ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్త ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామని తెలిపారు. కార్యాలయంలోని రికార్డులన్నింటినీ నిశితంగా పరిశీలించామని, పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. తనిఖీల్లో ఎఫ్ఆర్ఓ మనోహర్తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు నర్సింహారెడ్డి, వెంకటన్న, పాషా తదితరులు పాల్గొన్నారు.
ఫ నల్లగొండ సబ్ రిజిస్ట్రార్
కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
ఫ కార్యాలయ విధుల్లో ప్రైవేట్ వ్యక్తుల గుర్తింపు
ఫ పరుగులు పెట్టిన
డాక్యుమెంట్ రైటర్లు
విజిలెన్స్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తలుపులు మూసి తనిఖీలు చేస్తుండడంతో కార్యాలయ సిబ్బందితో పాటు డాక్యుమెంట్ రైటర్లు బెంబేలెత్తిపోయారు. ఏసీబీ అధికారులు వచ్చారని భావించిన కార్యాలయం వద్ద ఉన్న డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత వచ్చింది విజిలెన్స్ అధికారులేనని తెలుసుకున్న డాక్యుమెంట్ రైటర్లు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం కాసేపు ఉత్కంఠ నెలకొంది.


