
మద్దతు ధరకు మంగళం!
రకరకాల కొర్రీలతో ధాన్యం రేటు తగ్గిస్తున్న మిల్లర్లు
క్వింటాకు రూ.300 వరకు తగ్గింపు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో సుమారు 300కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. వీటిలో సన్నరకం ధాన్యం వాటిల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర సాధారణ రకం క్వింటాకు రూ.2,300, గ్రేడ్–1 రకానికి రూ.2,320 ఉంది. కానీ మిల్లుల్లో వివిధ సాకులతో మద్దతు ధర కంటే రూ.100 నుంచి రూ.300 వరకు తగ్గిస్తున్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడుస్తుందనే ఆందోళనతో మిల్లర్లు చెప్పిన ధరకే రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు. ఇక హెచ్ఎంటీ రకం ధాన్యాన్ని పెద్దగా కొనడమే లేదు. ఏ మిల్లులోనైనా కొనుగోలు చేస్తే రూ.2100లోపే చెల్లిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యాసంగి సీజన్లో మిల్లర్లు ధాన్యానికి ధర తగ్గించి అన్నదాతను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. మిల్లులకు పెద్ద మొత్తంలో ధాన్యం రావడంతో కొనుగోలు చేయకుండా మార్కెట్ లేదని, పచ్చ గింజ ఉందని, తాలు, ఎక్కువ డ్రై అయిందంటూ కొర్రీలు పెడుతూ ధర తగ్గిస్తున్నారు. ఒక మిల్లులో కొనకపోవడంతో మరో మిల్లుకు వెళ్లడం, అక్కడా కొనుగోలు చేయకపోవడంతో ఇంకో మిల్లుకు వెళ్లడం ఇలా రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. దీంతో అధికారులే దగ్గరుండి ధాన్యం ట్రాక్టర్లను మిల్లుల్లోకి పంపిస్తున్నా.. ధరను అమాంతం తగ్గిస్తున్నారు. వానాకాలం సీజన్లో క్వింటాకు రూ.2,800 వరకు ధర పెట్టిన మిల్లర్లు ఇప్పుడు సుమారు రూ.500 నుంచి రూ.600 వరకు ధర తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కేంద్రాల్లో నెమ్మదిగా కొనుగోళ్లు..
జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు వేగంగా సాగడం లేదు. 17 శాతంలోపు తేమ ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిస్తే గ్రేడ్–1 ధాన్యం క్వింటాకు రూ.2,320 మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్తో కలిసి రూ.2,820 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఆయా కేంద్రాల వద్ద కొనుగోళ్లలో వేగం పుంజుకోవడం లేదు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు 85వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాద్దిప్పటి వరకు 10వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. 90 శాతం మంది రైతులు ధాన్యాన్ని మిల్లులకే అమ్ముకుంటున్నారు. ఇప్పటివరకు మిర్యాలగూడలో ఉన్న మిల్లుల్లోనే సుమారు 4 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం.
మిర్యాలగూడలోని ఓ మిల్లు వద్ద ధాన్యం ట్రాక్టర్లు
మిల్లర్లు ధర తగ్గించవద్దు
తేమ, పచ్చ గింజ, డ్రై అధికంగా ఉందని సాకులు చెప్పి ధర తగ్గించవద్దు. హెచ్ఎంటీ రకం ధాన్యాన్ని కూడా ఎక్కువ మంది రైతులు సాగు చేశారు. మార్కెట్లో ఆ ధాన్యానికి డిమాండ్ లేదని కొనకపోవడం సరైందికాదు. ఏ ధాన్యమైనా మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలి.
– వీరేపల్లి వెంకటేశ్వర్లు,
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
హెచ్ఎంటీకి మార్కెట్ లేదు
ప్రభుత్వం పేదలకు రేషన్షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఆ బియ్యం హెచ్ఎంటీలకు సమానంగా ఉంది. దీంతో మార్కెట్లో ఆ బియ్యానికి రూ.400కు పైగా ధర తగ్గిపోయింది. మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో హెచ్ఎంటీ రకం ధాన్యాన్ని తక్కువగా కొనుగోలు చేస్తున్నాం. జైశ్రీరామ్, చింట్లూ, జేఎస్ఆర్ తదితర సన్నరకం ధాన్యానికి దాదాపు మద్దతు ధర ఇస్తున్నాం.
– గౌరు శ్రీనివాస్, మిర్యాలగూడ
మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
2,100 రూపాయలే పెట్టారు
మిర్యాలగూడలోని ఓ మిల్లులో నా ధాన్యం క్వింటాకు రూ.2,100 ధర పెట్టారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మద్దతు ధర కంటే తక్కువ ధరకే నా ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది.
– వెంకన్న, పాములపాడు
అధికారులు పట్టించుకోవడం లేదు
అధికారులు పట్టించుకోకపోవడం వల్లే మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్నారు. కావేరి చింట్లు రకానికి గత సీజన్లో రూ.2,800 వరకు కొన్నారు. ఇప్పుడు రూ.2,250 కే అమ్ముకోవాల్సి వచ్చింది.
– సత్యనారాయణరెడ్డి, నాగారం
ఫ సిండికేట్గా మారి కనీస
మద్దతు ధర చెల్లించని మిల్లర్లు
ఫ వానాకాలం సీజన్తో పోల్చితే
ధరలో భారీగా కోత
ఫ దగ్గరుండి మిల్లుల్లోకి ధాన్యం ట్రాక్లర్లు
పంపిస్తున్న అధికారులు
ఫ వారి సాక్షిగానే మిల్లుల్లో
సాగుతున్న దోపిడీ

మద్దతు ధరకు మంగళం!

మద్దతు ధరకు మంగళం!

మద్దతు ధరకు మంగళం!

మద్దతు ధరకు మంగళం!