
నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్, బీచ్ వాలీబాల్ అండర్ –19 బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈనెల 5వ తేదీన నల్లగొండలోని అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎస్జీఎప్ (అండర్– 19) జిల్లా కార్యదర్శి కె.ఇందిర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, పదో తరగతి మెమోతో ఈ నెల 5న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు. వివరాలకు కె.నర్సిరెడ్డి (పోన్ నంబర్ 9640140183)ని సంప్రదించాలని సూచించారు.
ఎన్నికల సిబ్బందికి
వేతనాలు పెంచాలి
రామగిరి(నల్లగొండ): అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన సిబ్బందికి వేతనాలు పెంచాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ నాయకులు శనివారం కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఓలకు రూ.1,550, ఏపీఓలకు రూ.1,150, ఓపీఓలకు రూ.900 చెల్లించారని, తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కంటే తక్కువ ఇచ్చారని వారి దృష్టికి తీసుకెళ్లారు. నల్లగొండ జిల్లాలోని సిబ్బందికి కూడా మిగతా జిల్లాల మాదిరిగా చెల్లించాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంకటేశం ఉన్నారు.
‘చేనేతమిత్ర’ సాయం
అందజేయాలి
ఆత్మకూరు(ఎం) : చేనేతమిత్ర పథకం కింద అందజేస్తున్న ఆర్థిక సాయం ఇప్పటి వరకు కార్మికుల ఖాతాల్లో జమచేయలేదని, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా తక్షణమే చెల్లించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య కోరారు. శనివారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చేనేతమిత్ర పథకం ప్రవేశపెట్టిన తర్వాత రెండుసార్లు మాత్రమే ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు. జిల్లాలో 13 వేల మందికి పైగా చేనేత కార్మికులు ఉన్నారని, వారిలో జియోట్యాగ్ కలిగిన వారు 5,698 మంది ఉన్నట్లు చెప్పారు. కార్మికుడి ఖాతాలో ప్రతి నెలా రూ.2000, సహాయకుడికి రూ.500 చొప్పున వారి ఖాతాల్లో జమచేస్తారని తెలిపారు. పథకం అమల్లోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా కేవలం రెండుసార్లు మాత్రమే ఆర్థిక సాయం అందజేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా చేనేత సంక్షేమానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
యాదాద్రిలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఆచార్యులు వేకువజామున ఆలయాన్ని తెరిచి శ్రీస్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. అనంతరం ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చ, అష్టోత్తర పూజలు గావించారు. సాయంత్రం జోడు సేవలను మాఢవీధిలో ఊరేగించారు. కార్తీకమాసం కావడంతో భక్తులు దీపారాధన, సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు.
రాష్ట్రస్థాయి
ఖోఖో పోటీలకు ఎంపిక
సూర్యాపేట రూరల్: ఆసిఫాబాద్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి అండర్–14 ఖోఖో టోర్నమెంట్కు సూర్యాపేట మండలం బాలెంల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని బొలగాని భవ్య ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం జెల్లా ప్రసాద్ తెలిపారు. శనివారం పాఠశాలలో శివరాత్రి భిక్షపతి జ్ఞాపకార్థం శివరాత్రి శేఖర్ సౌజన్యంతో నిర్వహించిన ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో ఆడేందుకు ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు.

కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారికి వినతిపత్రం అందజేస్తున్న యూటీఎఫ్ నాయకులు