చారకొండ: నిత్యం సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే సినీ హీరో శర్వానంద్ నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మండలంలోని జూపల్లి రెవెన్యూ శివారులో జేపల్లి సమీపాన భూమిని కొనుగోలు చేసిన ఆయన శనివారం రిజిస్ట్రేషన్ నిమిత్తం చారకొండ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. భూమికి సంబంధించిన పత్రాలతో నిబంధనల మేరకు తహసీల్దార్ ఉమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. సుమారు 25 ఎకరాల భూమి కొ నుగోలు చేసినట్లు తెలిసింది. చారకొండకు సినీ హీరో రావడంతో అభిమానులు పెద్దఎత్తున తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
రాజీ మార్గంతో
సమయం, డబ్బు ఆదా
కందనూలు: లోక్అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారంతో కక్షిదారులు అప్పీల్ లేని తీర్పును పొంది.. సమయం, డబ్బును ఆదా చేసుకోవచ్చని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. సెప్టెంబర్ 12న నిర్వహించనున్న లోక్అదాలత్పై శనివారం జిల్లా కోర్టు హాల్లో పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. లోక్అదాలత్లో భూ తగాదాలు, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్బౌన్స్, కుటుంబ తగాదాలు, మోటారు వాహనాల ప్రమాద కేసులు, బ్యాంకు కేసులు తదితర పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. తద్వారా అప్పీల్ లేని తీర్పును పొందవచ్చన్నారు. కక్షిదారులు పగలు, ప్రతీకారాలు పెంచుకోకుండా ఇరు వర్గాలు రాజీ చేసుకోవడం ద్వారా మానవ సంబంధాలు బలపడతాయని అన్నారు. సెప్టెంబర్ 12న జిల్లాలోని న్యాయస్థానాల్లో నిర్వహించే లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో స్పెషల్ సెషన్స్ జడ్జి నసీమా సుల్లానా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి శృతిదూత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి శ్రీనిధి ఉన్నారు.
కార్మికుల హక్కుల
పరిరక్షణే ధ్యేయం
కందనూలు/కల్వకుర్తి రూరల్: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. శనివారం నాగర్కర్నూల్, కల్వకుర్తి ఆర్టీసీ డిపోల వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్ల్లో ఆయన మాట్లాడారు. తమ సంఘం చేపట్టే కార్యక్రమాలు కార్మికుల సంక్షేమం, అభ్యున్నతి కోసమేనని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టడానికి సిద్ధంగా ఉందని.. అందులో కార్మికుల పాత్ర కీలకంగా ఉండేందుకు రాబోయే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూను గెలిపించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించామని.. ఎన్నో విజయాలతో కార్మికులకు న్యాయం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ.. కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తూ, కార్మికులను వంచించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జగదీశ్వర్, రవి, శంకర్, నాగయ్య, అహ్మద్ ఖాన్, వీఎస్ నారాయణ, మధు, బాబురావు, పెంటయ్య, చంద్రయ్య, శేషమ్మ, మల్లయ్య, సంతోష్రెడ్డి, మంజుల, ఆరిఫ్, సదానందం పాల్గొన్నారు.


