కందనూలు: ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీసీలో పాల్గొన్న అనంతరం ఆయన జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. బీఎల్ఓలు సదరు వ్యక్తులకు మాత్రమే నోటీసులను అందజేసేలా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నోటీసులు అందజేసిన అనంతరం సంబంధిత వ్యక్తి నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడంతో పాటు ప్రక్రియకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. నోటీసుల జారీ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఓటర్లు హియరింగ్ సమయంలో సమర్పించాల్సిన ధ్రువపత్రాల విషయంపై కూడా ముందుగానే స్పష్టత ఇవ్వాలన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఈఆర్ఓలకు హియరింగ్ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అనామలీస్, నోమ్యాపింగ్కు సంబంధించిన వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా నిబంధనల మేరకు పంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ, సంబంధిత సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఒక చిరునామాలో నివసిస్తున్న వ్యక్తులను మరో చిరునామాలో చూపించడం, ఒక చిరునామాలో నివసించని వ్యక్తులను అదే చిరునామాలో ఉన్నట్లు నమోదు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వస్తే, సమగ్రంగా విచారణ చేపట్టాలన్నారు. ఇలాంటి తప్పిదాలు సంబంధిత బీఎల్ఓల నిర్లక్ష్యం ద్వా రా జరిగినట్లు నిర్ధారణ అయితే, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ చెన్నయ్య ఉన్నారు.
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత
వినియోగించాలి..
రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకత పెంపే లక్ష్యంగా శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బిజినేపల్లి మండలం పాలెం వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శించి.. రైతులకు అందిస్తున్న సేవలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ సాంకేతికత ప్రదర్శనలతో పాటు ఇన్స్ట్రక్షనల్ ఫారంలో కొనసాగుతున్న వివిధ యూనిట్లను పరిశీలించారు. కేవీకే ద్వారా అందిస్తున్న సాంకేతిక సేవలు రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా, ఫలితాలు కనిపించే విధంగా ఉండాలని ఆయన సూచించారు. రైతులు కేవలం సంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా, మార్కెట్ డిమాండ్, నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ చేపట్టేలా ప్రోత్సహించాలని తెలిపారు. కలెక్టర్ వెంట సీనియర్ సైంటిస్ట్ డా.శైలజ ఉన్నారు.


