కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో బాధితుల నుంచి ఏఎస్పీ 10 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూమికి సంబంధించినవి 7, న్యాయం చేయాలని 2, భార్యభర్తల పంచాయితీకి 1 ఫిర్యాదు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం వాటిని సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఏఎస్పీ తెలిపారు.
డ్రగ్స్ వినియోగంతో జీవితాలు ఆగం
బల్మూర్: మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగించడం ద్వారా జీవితాలు ఆగం అవడంతో పాటు కుటుంబాలు విచ్ఛినం అవుతాయని అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. మండలంలోని కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం డ్రగ్స్ నియంత్రణ, వాటి వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ., విద్యార్థులు చెడు వ్యసనాలకు, ప్రలోభాలకు, ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో పాటు గంజాయి, సారా వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించే వెంటనే అందరూ తమ వంతు బాధ్యతగా 1908 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ నాగరాజు, ఎస్ఐ రాజేందర్, సర్పంచ్ పద్మ, ఉప సర్పంచ్ నర్సింహ, హెచ్ఎం పరమేశ్వర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆర్జీలు వేగంగాపరిష్కరించాలి
కందనూలు: ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని డీఆర్ఓ పాండునాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఏఓ చంద్రశేఖర్తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. ప్రజావాణిలో 66 దరఖాస్తులు వచ్చాయని, వీటిని వెంటనే పరిశీలించి బాధితులకు సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


