పెద్దకొత్తపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఇకపై ప్రజలతో కలిసి పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ అన్నారు. సోమవారం సీపీఐ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని దేదినేనిపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడుత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులోనైనా పక్షపాత ధోరణి లేకుండా అర్హులకే ఇళ్లు కేటాయించాలని కోరారు. వందేళ్లుగా దేశంలో పేదల అభ్యున్నతి కోసం నిరంతర పోరాటాలు చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాల అమలు, చట్టాలను రూపొందించడంలోనూ సీపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో నర్సింహ, లక్ష్మీనారాయణ, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి, కందికొండ స్వామి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు మల్లయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.


