సెల్లార్లలో వ్యాపారాలు.. రోడ్లపై వాహనాలు
● సెట్బ్యాక్ లేకుండానే అపార్ట్మెంట్లు, దుకాణ సముదాయ నిర్మాణాలు
● ట్రాఫిక్ సమస్యలతో ప్రజలకు కష్టాలు
● పొంచి ఉన్న ప్రమాదం
● చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
సెట్బ్యాక్లు పట్టించుకోరు?
ప్రధాన రహదారుల్లో వాణిజ్య నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ఎక్కడ కూడా సెట్ బ్యాక్ నిబంధనలు అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. పురపాలికల అనుమతులు ఒకలాగా.. ప్లానింగ్ తీసుకొని, నిర్మానాలు మాత్రం మరొకలా చేపడుతున్నా రు. వాణిజ్య భవనాల కోసం జీప్లస్ వన్ అనుమతి ధ్రువీకరణ పత్రాలు పొందుతూ తదుపరి ఇష్టానురీతిగా అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తున్నారు. జీప్లస్ వన్ వరకు సెల్లార్ నిర్మించకపోయినా 2 మీటర్ల వరకు సెట్బ్యాక్ ఉండాలి. అడుగు స్థలం వద లకుండా రోడ్డుపైకి నిర్మాణాలు చేపడుతున్నారు. రెండంతస్తుల నుంచి నాలుగైదు అంతస్తుల భవనాలు అనధికారికంగా వెలుస్తున్నాయి.
అచ్చంపేట: పట్టణాలు రోజుకోజుకూ విస్తరిస్తున్న తరుణంలో ప్రజలను, వాహనదారులను పార్కింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గత్యంతరం లేక రోడ్లపైనే వాహనాలు నిలపాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేప్పడు సెల్లార్లలో పార్కింగ్కు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ యజమానుల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సెల్లార్లు సైతం వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెల్లార్లను అద్దెకిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుటున్నారు. వాటిలో మొబైల్ రిపేరు సెంటర్లు, హోటళ్లు, ఇంటర్నెట్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. దీంతో రోడ్లపైనే వాహనాల పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. పట్టణాల్లో జనాభాతో పాటు వాహనాల రద్దీ పెరగడం, ఆయా ప్రాంతాల్లో కావాల్సిన పార్కింగ్ స్థలం లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. పాదాచారులు నడవడానికి సైతం వీలులేని పరిస్థితి ఉంది. ప్రజల భద్రత దృష్ట్యా సెల్లార్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది.
నిబంధనలకు పాతర..
భవన నిర్మాణ నిబంధనల ప్రకారం 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన భవనాలకు ఒక సెల్లార్, 1,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్న భవనాలకు రెండో అంతస్తులో సెల్లార్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సెల్లార్లు పూర్తిగా వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించాలి. అయితే పట్టణాల్లో పలు వాణిజ్య భవనాల్లో ఈ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సంబంధిత పురపాలక అధికారులు భవనాల విస్తీర్ణం, అనుమతులు, సెల్లార్ల వినియోగంపై క్షేత్రస్థాయిలో కొలతలు వేసి తనిఖీలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాఽశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


