మన్ననూర్: నల్లమల అభయారణ్యంలోని వన్యప్రాణులు, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అటవీశాఖతో పాటు ప్రజలందరిపై ఉందని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మన్ననూర్, అమ్రాబాద్ అటవీశాఖ రేంజ్ల పరిధిలోని దుర్వాసుల చెరువు వద్ద గురువారం నిర్వహించిన వనమహోత్సవంలో డీఎఫ్ఓ రేవంత్ చంద్రతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే అతి విశాలమైన అటవీ ప్రాంతాల్లో నల్లమల పరివాహక ప్రాంతం ఒకటి కావడం అదృష్టంగా భావించాలన్నారు. ఈ ప్రాంతంలోని టేకుకు ఎంతో విలువ ఉండేదని.. పెద్దపులుల సంఖ్య కూడా 125–135 వరకు ఉండేవన్నారు. ప్రస్తుతం పెద్దపులల సంఖ్య 42కు పెరగడం ప్రశంసనీయమన్నారు. జంగిల్ సఫారీ కూడా ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చేవిధంగా ఉందన్నారు. అడవి అభివృద్ధి కోసం హెలీకాప్టర్ ద్వారా సీడ్ బాల్స్ చల్లాలని సంబంధిత మంత్రితో మాట్లాడటం జరిగిందని ఆయన తెలిపారు. అదే విధంగా అటవీ సమీప గ్రామాల్లో కోతుల బెడదను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఫారెస్టు బీట్ ఆఫీసర్స్ నియామకాలు చేపట్టనుందని.. 20ఏళ్లుగా కాంట్రాక్టు బేసిక్లో వాచర్లుగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యేతో పాటు డీఎఫ్ఓకు 140మంది వాచర్లు వినతిపత్రం అందజేశారు. అనంతరం వాచర్ విష్ణు ఓ ఇంట్లో సురక్షితంగా పట్టుకున్న పామును అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కార్యక్రమంలో డీపీఓ శ్రీరాములు, ఎఫ్డీఓలు రామ్మూర్తి, రామ్మోహన్ చంద్రశేఖర్, ఎంపీడీఓ లింగయ్య, భగీరథ డీఈలు విజయశ్రీ, హేమలత, ఎఫ్ఆర్ఓలు వీరేష్, సవిత, ఈశ్వర్, సర్పంచ్ మంజుల, రాజారాం, ఎంఏ రహీం, వెంకటరమణ, సత్యనారాయణ, శ్రీనివాసులు, తిరుపతి, నిరంజన్ పాల్గొన్నారు.


