కల్వకుర్తి రూరల్: ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు రక్షణ, సామాజిక భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి మైకేల్ మనోహర్ అన్నారు. గురువారం యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఆయన జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు ప్రాణం పోస్తున్నారని.. కరోనా సమయంలో చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా ప్రభుత్వమే వేతనాలు అందించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ శివరాం, విష్ణు, యశోదబాయి, భారతి, రహీం, శ్రీకాంత్, రమేశ్, శిరోమణి, పరుశరాములు పాల్గొన్నారు.


