
నేటినుంచి ఎస్ఏ–2 పరీక్షలు
కందనూలు: జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మెటివ్ అసెస్మెంట్–2) నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ఆయా ఎమ్మార్సీల నుంచి ప్రశ్నపత్రాలు పాఠశాలలకు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 1,019 పాఠశాలలు ఉండగా.. వీటిలో 1 నుంచి 9వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాధ్యమాల్లో కలిపి 1,06,000 మంది విద్యార్థులు చదువుతున్నారు.
పరీక్షల సమయం ఇలా..
అన్ని తరగతులకు ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. 1 నుంచి 7వ తరగతి వరకు 11– 30 గంటల వరకు, 8వ తరగతికి 11.45 గంటల వరకు, 9వ తరగతికి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక విద్యార్థులకు ఈ నెల 11న తెలుగు, 12న ఆంగ్లం, 15న గణితం, 16న పరిసరాల విజ్ఞానం పరీక్షలు కొనసాగుతాయి. 6, 7 తరగతుల వారికి 9న తెలుగు, 10న హిందీ, 11న ఆంగ్లం, 12న సాంఘికశాస్త్రం, 15న జనరల్ సైన్స్, 16న గణితం పరీక్షలు ఉంటాయి. 8, 9 తరగతులకు 9న తెలుగు, 10న హిందీ, 11న ఆంగ్లం, 12న గణితం, 15న భౌతికశాస్త్రం, 16న జీవశాస్త్రం, 17న సాంఘికశాస్త్రం పరీక్షలు రాయనున్నారు. 23న పీటీఎం నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని జిల్లా డీసీఈబీ అధికారి రాజశేఖర్రావు తెలిపారు.
జిల్లాలో 1,06,000 మంది విద్యార్థులు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు