
ఉపాధి కూలీలకు ఊరట
రోజువారీ కూలి రూ.300 నుంచి రూ.307కు పెంపు
●
సద్వినియోగం చేసుకోవాలి..
ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల రోజువారీ వేతనం రూ.307కు పెరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సగటు కూలి రూ.300 వచ్చేలా కొలతలు తీసి కూలీలతో పనులు చేయించాలని ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– ఓబులేసు, డీఆర్డీఓ
మరింత పెంచాలి..
ఉపాధి హామీ ద్వారా ఇస్తామన్న రూ.307 కూలి ఏమాత్రం సరిపోదు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరింత పెంచాలి. బయట వ్యవసాయ, ఇతర పనులకు వెళ్తే రూ.600 దాకా కూలి వస్తది. ప్రభుత్వం ఇచ్చే కూలి సరిపోక వ్యవసాయ ఇతర పనులకే పోతున్నాం.
– లక్ష్మయ్య, ఉపాధి కూలీ, గట్టురాయిపాకుల
నాగర్కర్నూల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ కూలీలకు మేలు చేసేందుకు, కూలి చెల్లింపుల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మరోమారు ఉపాధి హామీలో చెల్లించే కూలిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన కూలిని ఈ నెల నుంచే అమలు చేసేందుకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. 2005 సంవత్సరంలో మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం ప్రారంభం కాగా మొదట్లో రూ.87.50 చెల్లించేవారు. అయితే ప్రతిఏటా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం కూలీలకు రూ.300 చెల్లిస్తున్నారు. కాగా ప్రస్తుతం పెంచిన వాటితో ఉపాధి కూలి రూ.307కు చేరుకుంది.
గతేడాది రూ.300..
జిల్లాలో మొత్తం 1,11,181 యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా అందులో 1,69,870 మంది కూలీలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెంచిన కూలితో పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది. 2022 మార్చి వరకు కూలీలకు రోజుకు రూ.245 చెల్లిస్తుండగా.. అదే ఏడాది మార్చిలో రూ.12 పెంచి రోజువారీ కూలిని రూ.257 చెల్లించారు. తర్వాత 2023 ఏప్రిల్లో కూలిని మరో రూ.15 పెంచడంతో రూ.272కు చేరుకుంది. 2024లో రూ.28 పెంపుతో రూ.300లకు చేరుకోగా.. ఈ ఏడాది రూ.7 పెంచడంతో రూ.307కు చేరుకుంది. పెంచిన ఈ కూలిని ఈ నెల నుంచే అమలు చేసేలా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే గతేడాది ఉపాధి కూలి రూ.300 వరకు ఉన్నా ఒకరోజు సగటు వేతనం రూ.201 వరకే అందింది. కాబట్టి ఈ ఏడాది ప్రతి కూలీకి సగటున రూ.300 అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కాగా.. జిల్లాలో ఈ ఏడాది 38.30 లక్షల పనిదినాల లక్ష్యం నిర్దేశించగా, ఇందుకోసం రూ.114 కోట్ల అంచనా బడ్జెట్ వెచ్చించారు.
చెల్లింపుల్లోనూ పారదర్శకతకు
కేంద్ర ప్రభుత్వం చర్యలు
గతేడాది సగటున
రూ.201 మాత్రమే చెల్లింపు
పనులకు వచ్చేందుకు
ఆసక్తి చూపని ప్రజలు
వ్యవసాయ పనులకే
మొగ్గుచూపుతున్న వైనం
ప్రైవేట్ వైపే మొగ్గు..
ఉపాధి హామీ పథకంలో కూలి ప్రతిఏటా పెంచుతున్నా జిల్లాలో కూలీలు మాత్రం ఉపాధి పనులకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో వేసవిలో కూలీలకు వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి పనులకు వచ్చేందుకు మొగ్గుచూపేవారు. అయితే ప్రస్తుతం రూ.300 కూలి చెల్లిస్తున్నా.. పనుల కొలతల ప్రకారమే ఇస్తుండటంతో కూలీలకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. దీనికితోడు ప్రైవేట్లో కూలీల కొరత ఉండడం, కూలి కూడా రూ.500 నుంచి రూ.600 వరకు వస్తుండటంతో కూలీలు ప్రైవేట్ పనులకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా వ్యవసాయ పనుల సమయంలో కూలీలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో రూ.700 వరకు కూలి చెల్లించడమే కాకుండా కూలీలు వెళ్లేందుకు వాహన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. దీంతో ఉపాధి పనులు మానేసి ఇతర పనులపై కూలీలు ఆసక్తి చూపుతున్నారు.

ఉపాధి కూలీలకు ఊరట