● తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్కుమార్
ఎస్ఎస్తాడ్వాయి: ఆదివాసీల హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఆదివాసీ మార్చ్కు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను తుడుందెబ్బ నాయకులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీల మనుగడ దినదినగండంగా మారుతోందన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేదని విమర్శించారు. ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏల ద్వారానే ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. సమస్యల పరిష్కారానికి మార్చ్లు సెప్టెంబర్ 7న ఏటూరునాగారం, 16న ఉట్నూర్, 21న భద్రాచలం, 28న మన్ననూరులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ఆదివాసీలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు పొడెం బాబు, రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్, ఏఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. గణేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


