● టెలికాన్ఫరెన్స్లో రాష్ట్ర
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు: చెక్డ్యామ్లు, పంట కుంటల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రతీ గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 60 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య, ప్రత్యేక కమిషనర్ శ్రీలక్ష్మితో కలిసి మంత్రి సీతక్క జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన పంటకుంటల పనులను వెంటనే ప్రారంభించి, ఉపాధి కల్పనతో పాటు నీటి సంరక్షణకు ఉపయోగపడే శాశ్వత ఆస్తులుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో చెక్డ్యామ్లు, పంటకుంటలు, ఇతర నీటి సంరక్షణ పనుల్లో వేగం పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, జీవనోపాధికి ఉపయోగపడే ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. అలాగే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 5.32 కోట్ల మొక్కలు నాటి 86 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ సంపత్రావు, డీఆర్డీఓ రవీందర్, డీపీఓ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.


