ములుగు: ఈ నెల 24వ తేదీ నుంచి ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నూతనంగా ప్రారంభించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోనే నిర్వహించనున్నట్లు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎడమ వైపున ఉన్న సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గట్టమ్మ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన అత్యాధునిక సౌకర్యాలతో నూతన కలెక్టరేట్ నిర్మించినట్లు పేర్కొన్నారు. విశాలమైన కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, ప్రజలకు అనుకూలమైన వసతులతో కలెక్టరేట్ ఉందని వివరించారు. సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తమ దరఖాస్తులను అందజేయవచ్చని కలెక్టర్ వివరించారు.
కేంద్రీయ విద్యాలయంలో
ప్రవేశాలు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్నగర్ మోడల్ స్కూల్ క్యాంపస్లో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయం 2026–27 విద్యా సంవత్సరానికి నూతన ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రీయ విద్యాలయం ములుగు ప్రిన్సిపాల్ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ నుంచి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల కోసం నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 10న లాటరీ పద్ధతిలో ఎంపిక, 12న ప్రవేశ జాబితా ప్రచురణ, 15 నుంచి 21 వరకు ప్రవేశాలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 23 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు వివరించారు. విద్యార్థుల వయస్సు, రిజర్వేషన్ తదితర ప్రవేశ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు నిర్ణీత గడువులోగా తమ పిల్లల ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.
కేంద్ర బృందం
ప్రతినిధుల పర్యటన
వాజేడు: మలేరియా నివారణపై కేంద్ర బృందం ప్రతినిధులు లక్ష్మణ్, అశోక్, సురేశ్ మండల పరిధిలోని పేరూరు పీహెచ్సీని గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ల్యాబోరేటరీ పరిశీలనతో పాటు కృష్ణాపురం, కడేకల్ గ్రామాల్లో పర్యటించారు. మలేరియా నిర్ధారణ, రక్త నమూనాల సేకరణ, పరీక్షలు, కేసుల గుర్తింపుతో పాటు అనుమానిత జ్వర కేసులపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మలేరియా జ్వరాల నివారణకు దోమల నివారణతో పాటు పరిసరాల పరిశుభ్రత, దోమ తెరలను వినియోగించాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప పీహెచ్సీలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పేరూరు వైద్యాధికారి భాస్కర్, సిబ్బంది దుర్గారావు, నరసింహరావు, వెంకటరెడ్డి, వేణుగోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


