ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో వచ్చిన వినతులను పరిశీలించి ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు పరిష్కరిస్తామని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. ఈ మేరకు ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో పది మంది గిరిజనుల నుంచి డీడీ వినతులు స్వీకరించారు. ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జన సమీకరణకు నిధులు అందజేయాలని గిరిజన సంఘాల నాయకులు డీడీకి మొరపెట్టుకున్నారు. ఏటూరునాగారం మండలం షాపెల్లిలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా బుక్కు పోయిందని, దాని స్థానంలో మరో కొత్త బుక్కు ఇవ్వాలని ఓ గిరిజనుడు విన్నవించుకున్నాడు. ఖానాపురం మండలంలోని కోమటిపల్లికి చెందిన గిరిజన రైతు తనకు ఉన్న భూమిలో వేరే ఒకరు దున్నుకుంటున్నారని, ఆక్రమించుకున్నాడని, ఈ విషయంపై కోర్టులో కేసు వేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజన రైతు మొరపెట్టుకున్నారు. ఇలా పలువురు తమతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీడీకి వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్, డీటీ అనిల్, జేడీఎం కొండల్రావు, సురేశ్, ఎకై ్సజ్ సీఐ కిశోర్, జీసీసీ డీఎం వాణి, పెసా కోఆర్డినేటర్ ప్రభాకర్, ఎఫ్ఆర్ఓ అబ్దుల్రెహమాన్ పాల్గొన్నారు.
ఐటీడీఏ డీడీ జనార్దన్


