బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తాం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి యాజమాన్యం కేటాయించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తామని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి ఏరియాకు సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో 46.54లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని విధించిందన్నారు. గడిచిన తొమ్మిది మాసాల్లో 22.94లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టి 69శాతంలో నిలిచామని పేర్కొన్నారు. గతేడాది 37లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని వెలికితీయగా.. ఈ ఏడాది అంతకుమించి బొగ్గు ఉత్పత్తి చేపడుతామని తెలిపారు. గడిచిన డిసెంబర్ మాసంలో 65శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. సాధించిన బొగ్గు ఉత్పత్తిలో 2.91లక్షల టన్నుల బొగ్గును రవాణా చేశామన్నారు. ఏరియా అక్టోబర్ మాసం వరకు రూ.440 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. ఏరియాలో ప్రతీ రోజు సుమారు 9500వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపడుతున్నట్లు చెప్పారు. శీతాకాలం నేపథ్యంలో బొగ్గు డిమాండ్ తగ్గిందని, వర్షాకాలం నేపథ్యంలో ఏరియాలోని ఓపెన్కాస్టు గనుల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులకు అంతరాయం కలిగిందన్నారు. యువ కార్మికుల గైర్హాజరు శాతం అధికంగా ఉంటుందన్నారు. భవిష్యత్లో భూపాలపల్లి ఏరియాలో ఏడాదికి 100లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వెంకటాపూర్ పీవీఎన్ఆర్ ఓపెన్ కాస్టు ఏర్పాటుపై త్వరలోనే ములుగు కలెక్టర్ను కలిసి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది నుంచి బొగ్గు ఉత్పత్తి చేపట్టనున్నట్లు జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి వెల్లడించారు.
ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్
రాజేశ్వర్రెడ్డి


