
మరమ్మతుకు నోచని ‘మల్లూరు’
మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు
నిధులు కేటాయించాలి..
వేలాది ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం నిధులు కేటాయించాలి. మల్లూరు మధ్యతరహా ప్రాజెక్టుతో పాటు ఈప్రాంత సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన మంత్రి సీతక్క ఈఅంశంపై స్పందించాలి. ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించాలి.
– తాటి భిక్షం, రైతు, నర్సింహాసాగర్
లీకేజీలకు మరమ్మతులు
చేపట్టాం..
ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ తూము లీకేజీలు, మత్తడి 1, 2, 3, 4 మరమ్మతులు, అపరాన్ల మరమ్మతులు చేపట్టేందుకు రూ.10.5 కోట్లు ఎస్టిమేట్ నివేదికను ఉన్నతాధికారుల ద్వారా ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయానికి పంపించాం.
– వలీమ్ మహ్మద్, ఏఈ,
ఏటూరునాగారం సబ్డివిజన్
మంగపేట: మండలంలోని మల్లూరు మధ్య తరహా ప్రాజెక్టు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టును ఆధునికీకరించి అభివృద్ధి చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన అధికారులు చుట్టపుచూపులా వచ్చి వెళ్తున్నారని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26 అడుగుల నీటి మట్టం సామర్థ్యంతో 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రాజెక్టును ప్రారంభించారు. 1980లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. మొట్ట మొదటిసారి ఆయకట్టు భూములకు సాగునీటిని వదిలారు. నర్సింహాసాగర్, పూరేడుపల్లి, శనిగకుంట, మల్లూరు, వాగొడ్డుగూడెం, రమణక్కపేట, చుంచుపల్లి వరకు ఉన్న 17 కిలోమీటర్ల కుడి కాల్వ ద్వారా సుమారు 4,300 ఎకరాలు, బాలన్నగూడెం, తిమ్మంపేట, మంగపేట, చెరుపల్లి తదితర గ్రామాల వరకు 8 కిలోమీటర్ల ఎడమ కాలువ ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరందాల్సి ఉంది.
హామీలు నీటి మూటలు..
ప్రాజెక్టు అభివృద్ధిపై గడిచిన పదేళ్లలో అప్పటి పాలకులు ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. 2015లో స్వయంగా అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, దివంగత మంత్రి చందూలాల్ ప్రాజెక్టును సందర్శించారు. వెంటనే ప్రాజెక్టు అభివృద్ధి కోసం.. కుడి, ఎడమ కాలువలు, తూముల నిర్మాణం, ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్ నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాలు అతీగతీ లేకుండా పోయాయి.
ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి శిథిలావస్థకు చేరింది. ఇప్పటికే మత్తడి పలు చోట్ల కొతకు గురై కొట్టుకుపోయింది. అపరాన్ పూర్తిగా ధ్వంసమై మూడేళ్లు గడుస్తున్నా.. ఇరిగేషన్ అధికారులు ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. తూముల లీకేజీలకు వేసవి కాలం ప్రాజెక్టులో నీరు నిండుకున్న సమయంలో చేపట్టకుండా.. వర్షాకాలంలో ప్రాజెక్టులోకి నీరు చేరిన తర్వాత మరమ్మతులు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు స్థానికులతో సంబంధిత అధికారులు కుమ్మకై ్క నాసిరకంగా మరమ్మతులు చేపడుతూ.. చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పొలాలకు ఉపయోగపడాల్సిన నీరు తూముల నుంచి లీకేజీ రూపంలో వృథాగా పోతోందని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో గత 15 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నా.. ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఈఏడాది మత్తడి నుంచి వరద నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తే మత్తడికే ప్రమాదం జరిగే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. అయిన్పటికీ అధికారుల్లో ఏమాత్రం చలనం రావట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
27 ఏళ్ల నుంచి ప్రాజెక్టు నిర్వాహణపై సంబంధిత ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పాలకులు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో అభివృద్ధికి నోచుకోక పూర్తి నిరాధరణకు గురైంది. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు అనుకూలించిన రెండు నుంచి నాలుగు ధఫాలు తప్ప ఎప్పుడు కూడా పూర్తి ఆయకట్టు భూములకు సాగునీరందిన సందర్భాలు లేవని రైతులు వాపోతున్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పుణ్యమా అంటూ.. ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.16 కోట్ల జపాన్(జైకా) నిధులు మంజూరయ్యాయి. పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అసంపూర్తిగా చేసి కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు అందినకాడికి దండుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుడి, ఎడమ కాలువల తూములకు ఏర్పడిన లీకేజీలకు మరమ్మతుల పేరుతో గత 10 ఏళ్ల కాలంలో కొందరు స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మకై ్క లక్షల రూపాయలు దండుకుని చేతులు దులుపుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

మరమ్మతుకు నోచని ‘మల్లూరు’

మరమ్మతుకు నోచని ‘మల్లూరు’

మరమ్మతుకు నోచని ‘మల్లూరు’