
29న హేమాచల క్షేత్రంలో జాతర వేలం
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 29న జాతర బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్లూరు గుట్టపై ఉన్న హేమాచల క్షేత్రంలో మే 8 నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(జాతర) ఆత్యంత వైభవంగా జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుట్టపై జరిగే పది రోజుల జాతరలో, జాతర ప్రారంభానికి ముందు మే 1 నుంచి 31 వరకు నెల రోజులు ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపులు ఏర్పాటు చేసుకుని విక్రయాలు జరిపేందుకు దేవాదాయశాఖ ద్వారా అనుమతి ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు రూ.లక్ష లడ్డు, పులిహోర ప్రసాదాలు తయారు చేసి విక్రయించేందుకు రూ.లక్ష, భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలు (పుట్టు వెంట్రుకలు) పోగు చేసుకునేందుకు రూ.2 లక్షలు, కొబ్బరి ముక్కలకు రూ.10 వేలు చెప్పుల స్టాండ్కు రూ.5 వేలు, ఫొటోలు తీసుకునేందుకు రూ.5 వేలు, బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈనెల 24 నుంచి 28 వరకు దేవస్థానం కార్యాలయంలో రూ.500 చెల్లించి కొటేషన్ కొనుగోలు చేయాలని సూచించారు. కొటేషన్ కొన్న వారికి మాత్రమే, షెడ్యూల్లో పొందుపర్చిన దరావత్తు సొమ్ము డిపాజిట్ చెల్లించిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంని పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ హైదరాబాద్ వారి తుది ఆమోద ఉత్తర్వుల మేరకు వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి సమాచారం కోసం హేమాచల క్షేత్రం ఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.