తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరణపై థియేటర్స్ యాజమాన్యం స్పందించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై థియేటర్ల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సినిమా టికెట్ ధరలను ఖరారు చేస్తూ విడుదల చేసిన జీఓను ఎగ్జిబిటర్లు ఖండించారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. పది రోజుల గడువు ఇచ్చి కోర్టును ఆశ్రయిస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.
మరోవైపు సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం రివ్యూ చేయాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి చేసింది. టికెట్ ధరల నిర్ణయంపై సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు జరపాలని కోరింది. జీవో నంబర్ 77ను మరోసారి పరిశీలించాలని విన్నవించిందియ సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్లలో కొత్త టికెట్ ధరలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాసింది. ఈ విషయంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని కోరింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను పరిశీలించాలని.. కొత్త విధానంతో టౌన్ థియేటర్లపై ప్రభావం ఉండొచ్చని ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ ఛాంబర్ అభిప్రాయ వ్యక్తం చేసింది. సినిమా ప్రతినిధులతో కన్సల్టేటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని అభ్యర్థించింది.


