సినీ నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్కు కుల మతాలకు అతీతంగా ధ్రువీకరణపత్రాన్ని వారంలోపు ఇవ్వాల్సిందిగా చెన్నై హైకోర్టు షోళింగనల్లూర్ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. ఇటీవల నటుడు ,దర్శకుడు పార్తీపన్ చెన్నై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అందులో 1958 జనవరి 14వ తేదీన జన్మించిన తనకు పుట్టిన తేదీ ధృవపత్రం లేదన్నారు. తాను పాత రోజుల్లో ఎస్ఎస్ఎస్సీ చదివిన విద్యా ధృవపత్రాన్ని కూడా పొందలేదు అన్నారు.
కులం, మతం, భాష వంటివి దేశ సమైక్యతకు ముప్పు కాబట్టి తనకు కులమతాలకతీతంగా జన్మ విద్య ధృవపత్రాలను ఇవ్వాలని కోరుతూ స్థానిక వేలచ్చేరి తహసీల్దార్ కు దరఖాస్తు పెట్టుకున్నాని పేర్కొన్నారు. తన దరఖాస్తును షోళింగనల్లూర్ తహసీల్దారుకు పంపారన్నారు. కాగా ఎన్నికల సమయం కావడంతో తన దరఖాస్తును పరిశీలించలేదని సదరు అధికారి తెలపడం కారణంగా నిర్దిష్ట కాలంలో తన దరఖాస్తును పరిశీలించాల్సింగా ఆదేశించాలని కోరారు.
నటుడు, దర్శకుడు పార్తీపన్ పిటిషన్ న్యాయమూర్తి ఎం. దండపాణి సమక్షంలో విచారణకు వచ్చింది. పరిశీలించిన న్యాయమూర్తి వారంలోపు నటుడు, దర్శకుడు పార్తీపన్ కులమతాలకతీతంగా జన్మ, విద్య ధ్రువీకరణ పత్రాలు అందించాలని షోలింగ నల్లూర్ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేస్తూ, ఆ ధృవపత్రాన్ని అందించిన విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేయాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు.


