పిటిషన్ వెనక్కు తీసుకున్న సోనూసూద్
న్యూఢిల్లీ: ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇంటికి సంబంధించిన వ్యవహారంలో తనపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా చూడాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన పిటిషన్ను వెనక్కు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ ఈ విషయాన్ని జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ల ధర్మాసనం ఎదుట శుక్రవారం వివరించారు. (సోనూసూద్కు నిరాశ.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు)
దీంతో పిటిషన్ను వెనక్కు తీసుకోవడానికి కోర్టు ఆనుమతిస్తూనే, క్రమబద్దీకరణ కోసం సోనూసూద్ పెట్టుకున్న దరఖాస్తుపై సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకునే వరకూ ఎలాంటి చర్యలూ అతనిపై తీసుకోవద్దని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు (బీఎంసీ) ఆదేశాలు ఇచ్చింది. జుహులోని ఆరు అంతస్తుల ‘శక్తి సాగర్’ భవనాన్ని వలస కార్మికుల కోసం హోటల్గా మార్చడంపై మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ కింద బీఎంసీ జనవరి 4న జుహు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. (రిషికపూర్ నా ప్రాణదాత)