
సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం... మండు వేసవి. దాదాపు 113 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో బెజవాడ అక్షరాలా ‘బ్లేజ్వాడ’గా ఠారెత్తిస్తోంది. వడగాడ్పులు, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఆ పరిస్థితుల్లో వాణిశ్రీ ప్రధానపాత్రలో, శోభన్బాబు హీరోగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘జీవనజ్యోతి’ చిత్రం రిలీజైంది. ఆ సెంటిమెంటల్ కుటుంబ కథ ఆ మండుటెండల్లోనే బాక్సాఫీస్ మలయమారుతమైంది. దేశంలో ఇందిరాగాంధీ సర్కార్ ఎమర్జెన్సీ విధించడానికి 40 రోజుల ముందు విడుదలై అటు ప్రకృతి, ఇటు సమాజంలోని ఆటుపోట్లకు అతీతంగా అఖండ విజయం అందుకుంది. సిల్వర్జూబ్లీ సూపర్హిట్గానే కాక, ఆ ఏడాది అత్యధిక వసూళ్ళు సాధించిన అరుదైన చిత్రంగా చరిత్రకెక్కింది. నిర్మాత డి.వి.ఎస్. రాజు సహా చిత్ర యూనిట్ అందరికీ చిరస్మరణీయ చిత్రంగా మిగిలిపోయింది. ‘జీవనజ్యోతి’ విడుదలై నేటితో 50 ఏళ్ళు. ఆ చిత్ర విశేషాలు...
ఎన్టీఆర్ కంపెనీలోకి... శోభన్బాబు
డి.వి.ఎస్. ప్రొడక్షన్స్, నిర్మాత డి.వి.ఎస్. రాజు పేరు చెప్పగానే ఆయన ఎన్టీఆర్తో నిర్మించిన ‘మంగమ్మ శపథం’ (1965) లాంటి పలు హిట్ చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆ సినిమాతో మొదలుపెట్టి వరుసగా పదేళ్ళ పాటు ఎన్టీఆర్తోనే సినిమాలు నిర్మిస్తూ వచ్చిన నిర్మాత ఆయన. అలాంటి డి.వి.ఎస్. రాజు తొలిసారిగా వేరే హీరోతో తీసిన సినిమా – ‘జీవనజ్యోతి’. నిజానికి, పంపిణీ సంస్థ ‘విజయా’ పిక్చర్స్ అధినేత పూర్ణచంద్రరావు చెప్పడంతో, దర్శకుడు విశ్వనాథ్ వద్దకు వెళ్ళి ఈ కథ విన్నారు రాజు. ఈ కథను కూడా ఆయన ఎన్టీఆర్తోనే తీద్దామనుకున్నారట. కానీ, ఫస్టాఫ్లో హీరో కాలేజీ విద్యార్థిగా కనిపించడం లాంటివి ఉన్నాయని తటపటాయించారు. చివరకు ఎన్టీఆరే ‘మనం మరో కథతో సినిమా చేద్దాం. శోభన్బాబు లాంటి నవ తరం హీరోతో ఈ కథ తెరకెక్కించమన్నార’ట. అలా రెగ్యులర్గా ఎన్టీఆర్తో సినిమాలు చేసే కంపెనీలోకి హీరోగా శోభన్బాబు వచ్చి చేరారు. అలా వచ్చింది – ‘జీవనజ్యోతి’. ఆ సూపర్హిట్ తర్వాత ఆ అందాల నటుడు ఆ బ్యానర్లోనే ‘జీవితనౌక’ (1977), ‘కాలాంతకులు’ (1978), ‘దోషి – నిర్దోషి’ (1990) చేశారు. ఇక, ‘జీవనజ్యోతి’ కన్నా ముందు నుంచే విశ్వనాథ్తో ‘చిన్ననాటి స్నేహితులు’ (1971) లాంటి చిత్రాలు నిర్మించిన డి.వి.ఎస్. రాజు అటు తర్వాత కూడా ఆ సృజనశీలికి పెద్దపీట వేశారు. 1980ల దాకా ఆయన నిర్దేశకత్వంలో పలు చిత్రాలు తీస్తూ వచ్చారు.
అయిదేళ్ళలో 4 ‘బంగారాల’ క్రేజీ కాంబినేషన్
కొన్ని కాంబినేషన్లు కుదిరిన వేళావిశేషం అంతే. విశ్వనాథ్ – శోభన్బాబుల కాంబినేషన్ ‘జీవనజ్యోతి’ ముందు నుంచీ సూపర్డూపర్ సక్సెసే. కాసులతో పాటు కావలసినంత పేరూ తెచ్చింది. 1971 నుంచి 1973 దాకా వరుసగా మూడేళ్ళూ వారిద్దరి కలయిక (‘చెల్లెలి కాపురం’, ‘కాలం మారింది’, ‘శారద’) కమర్షియల్ హిట్. ఆ చిత్రాలన్నీ ఉత్తమ చిత్రాలుగా రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందులు సాధించినవే. ఒక్క ఏడాది గ్యాప్ తర్వాత 1975లో మళ్ళీ వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జీవనజ్యోతి’ కూడా బాక్సాఫీస్ వద్దే కాక అవార్డుల్లోనూ బంగారమే పండించింది. అదీ అప్పట్లో విశ్వనాథ్ – శోభన్బాబుల క్రేజీ కాంబినేషన్ ఘనత. మరో విశేషం ఏమిటంటే, మధ్యలో 1974లో వాళ్ళిద్దరి కలయికలో సినిమా రాలేదు కానీ, ఆ ఏడాది కూడా విశ్వనాథ్ దర్శకత్వంలోని ‘ఓ సీత కథ’ (1974) బంగారు నందిని కాకున్నా, ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నందిని గెలిచింది. ఆ 1974లో బంగారు నంది తెలుగు విప్లవవీరుడి జీవితకథా చిత్రమైన కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ను వరించింది.
తెరపై ప్రతిభామూర్తుల త్రివేణీ సంగమం
నిజానికి, ‘జీవనజ్యోతి’ సమయానికి శోభన్బాబు హీరోగా వరుస విజయాలతో తారాపథానికి ఎదిగారు. ప్రతిభాశాలి అయిన దర్శకుడు కె. విశ్వనాథ్ ఏమో మూడేళ్ళు వరుసగా ఉత్తమ చిత్రాలు అందించి, వాటికి రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందులు సాధించి, మంచి ఊపు మీదున్నారు. పైగా, ఆ మూడు చిత్రాల్లోనూ హీరో శోభన్బాబే. హీరోయిన్ వాణిశ్రీ అప్పటికే సమకాలికులు అందరినీ దాటుకుంటూ ఆల్రెడీ అగ్రతారగా ఎదిగారు. ఆంధ్రుల అభిమాన నటీమణిగా మార్కెట్లో వెలిగారు. టాప్ హీరోలు ఎన్టీఆర్ (‘కోడలు దిద్దిన కాపురం’, ‘దేశోద్ధారకులు’, ‘మాయా మశ్ఛీంద్ర’), ఏయన్నార్ (‘దసరా బుల్లోడు’, ‘ప్రేమ్నగర్’) సరసన తీరిక లేనంత బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ సెంటిమెంటల్ కుటుంబ కథ ఆమెకు వచ్చింది. అందులోనూ మానసికంగా దెబ్బతిన్న ముసలి తల్లి పాత్ర, ఆ కన్నతల్లి కోసం చిన్నారి కొడుకును త్యాగం చేసే కూతురి పాత్ర... రెండూ పోషించాల్సిన డ్యుయల్ రోల్ ఆఫర్. అంతకు ముందే కన్నడంలో సంచలనం రేపిన ‘శరపంజర’ (1971) చిత్రానికి తెలుగు రీమేక్గా హీరో కృష్ణంరాజు తీసిన ‘కృష్ణవేణి’ (1974)లో మానసిక స్వస్థత కోల్పోయిన ఇల్లాలిగా నటించి పేరు తెచ్చుకున్నారు ‘కళాభినేత్రి’ వాణిశ్రీ. ఆ వెంటనే ఈ ‘జీవనజ్యోతి’లోని రెండు పాత్రలనూ మరో సవాలుగా తీసుకున్నారు. అలా అరుదైన దర్శకుడు, నాయికా నాయకుల కలయికలో నవరసాలూ రంగరించి, సప్తవర్ణాలతో ‘ఈస్ట్మన్ కలర్’లో తయారైంది – ‘జీవనజ్యోతి’.
గోదావరి పొంగు లాంటి కోనసీమ పిల్ల లక్ష్మి (వాణిశ్రీ)ని చూసీచూడగానే ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు గుంటూరు పిల్లగాడు వాసు (శోభన్బాబు). అతనికీ, ఆ ఉమ్మడి కుటుంబానికీ జ్యోతిగా మెలుగుతున్న ఆమెకు అనుకోని ఓ విషాద ఘటనతో మతి చలిస్తుంది. ఆ విషాదాన్ని ఆమె మనసు నుంచి దూరం చేసి, ఆమెను ఎవరు, ఎలా మామూలు మనిషిని చేశారు? ఆ కుటుంబంలో మళ్ళీ ‘జీవనజ్యోతి’ ఎలా వెలిగిందన్నది ఈ సెంటిమెంట్ సినిమా.
సినిమా ఫస్టాఫ్లో అల్లరిపిల్లగా కనిపించి, సెకండాఫ్లో పోగొట్టుకున్న తన బాబు కోసం ఆరాటపడే మతి భ్రమించిన మాతృమూర్తిగా కన్నీళ్ళుపెట్టించే లక్ష్మి పాత్రపోషణలోని రెండు విభిన్న ఛాయలను వాణిశ్రీ అద్భుతంగా అభినయించారు. అదే సమయంలో వయసు మళ్ళిన కన్నతల్లి కోసం తన ‘బాబు’ను త్యాగం చేసే కూతురు శోభ పాత్రనూ అంతే పరిణతితో పోషించారు. ‘సిన్ని ఓ సిన్నీ...’ అని పాటలు పాడే కోడెకారు కుర్రవాడి నుంచి మానసికంగా దెబ్బతిన్న భార్యను కాపాడుకోవడానికి తపించే భర్త వరకు జీవితంలోని వివిధ దశల్ని ప్రతిఫలించే వాసు పాత్రలో ఆ పరిణామాన్ని శోభన్బాబు తెరపై బాగా చూపారు. ముఖ్యంగా, చిన్నారి ‘బాబు’గా బేబీ వరలక్ష్మి కూడా రెండు పాత్రల్లో ఆ రోజుల్లో ప్రేక్షకుల మనసు చూరగొంది. రథం కింద బాబు పడిపోయే అత్యంత కీలకమైన దృశ్యం గగుర్పాటు కలిగించి, కన్నీరు తెప్పించింది. సినిమా కథను మలుపు తిప్పే ఆ సన్నివేశ చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ, జి.కె. రాము ఛాయాగ్రహణ నైపుణ్యం తెరపై సినిమా కాదు... నిజజీవిత ఘట్టం చూస్తున్నామన్నంత అనుభూతిని కలిగించాయి.
డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ సంస్థలో కలర్లో తీసిన తొలి సినిమా కూడా ఇదే. అందుకు తగ్గట్టే, నిర్మాత రాజు తాను పుట్టిపెరిగిన కోనసీమ ప్రాంత అందాలనూ, ఆహ్లాదం పంచే అరటి – కొబ్బరి తోటలనూ, గోదావరి నదీ తీర సౌందర్యాన్నీ పాటల్లో, సన్నివేశాల్లో చూపేలా గన్నవరం ఆక్విడెక్ట్ వద్ద, అమలాపురం దగ్గరలోని కోడూరుపాడు, అల్లవరం, వెన్నుమూరు లంక గ్రామాల్లో చిత్ర నిర్మాణం సాగించారు. ఆయన మేనమామ గారి ఊరైన కోడూరుపాడులోనే క్లిష్టమైన రథోత్సవం సీన్ చిత్రీకరణ సాగింది.
అభిప్రాయ భేదాలున్నా... అదే అభిమానం
సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల్ని కథలో లీనమైపోయేలా తీసిన ప్రతిభ దర్శకుడిది. ప్రముఖ రచయిత ఆరుద్ర జీవిత భాగస్వామి – స్వయంగా ప్రఖ్యాత రచయిత్రి అయిన శ్రీమతి కె. రామలక్ష్మి ఈ చిత్రానికి మూలకథ సమకూర్చారు. దానికి విశ్వనాథ్ స్క్రీన్ప్లేతో సానపెట్టారు. (రామలక్ష్మి నవల ‘ఆడది’ ఈ చిత్రానికి మూలమని కొందరు రాస్తుంటారు. కానీ, 1967– ’68 ప్రాంతంలో ధారావాహికగా రాసిన ఆ చిన్న నవలకూ, ఈ సినిమాకూ పోలికే లేదు). అయితే, ఈ చిత్ర సందర్భంగా రామలక్ష్మి, విశ్వనాథ్ల మధ్య సృజనాత్మక అభిప్రాయభేదాలు వచ్చాయి. ఆ తరువాత వారిద్దరూ ఎప్పుడూ కలసి పనిచేయలేదు. కానీ, చివరి వరకు పరస్పర గౌరవాభిమానాలు మాత్రం ఎప్పటిలానే కొనసాగడం నేటి తరానికి ఓ గొప్ప జీవనపాఠం.
‘జీవనజ్యోతి’లో కె. విశ్వనాథ్ ఎప్పటిలానే విలక్షణమైన క్యారెక్టర్లు, వాటికంటూ ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్లతో పాటు తనదైన మార్కుతో కథలో అంతర్భాగంగానే రాజబాబు, రమాప్రభ జంటతో హాస్యం చిలికించారు. ఆయన చిరకాల మిత్రుడు, సహాధ్యాయి అయిన సముద్రాల జూనియర్ సంభాషణల్లో తన పట్టును మరోసారి ఈ చిత్రంలో చూపారు. అఫ్కోర్స్... ఆ రచనలో విశ్వనాథ్ గారి అదృశ్యహస్తమూ ఉందనేది బహిరంగ రహస్యం. సాక్షాత్తూ చిత్ర నిర్మాత డి.వి.ఎస్. రాజు సైతం బాహాటంగా చెప్పిన సత్యం.
ఇంటింటా మోగిన ఆ పాటలు
‘ఇంత మంచి చిత్రం ఇటీవల రాలేదనీ, ఇది సినిమా కాదు... జీవితమనీ’ ఈ సినిమాకు జనం నీరాజనాలు పట్టారు. ఆ రోజుల్లో ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు...’ (గానం – పి. సుశీల) పాట మోగని ఇల్లు లేదు. పాడని తల్లి లేదు. ‘ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో...’ (గానం – బి. వసంత, పి. సుశీల) అంటూ సినిమాలో కీలకమైన పిల్లాడి పాత్ర మీద వచ్చే పాట అప్పట్లో ఆబాలగోపాలానికీ ఆల్టైమ్ ఫేవరెట్. డ్యూయెట్లలో ‘సిన్ని ఓ సిన్నీ... ఓ సన్నజాజుల సిన్నీ...’ పాట అన్ని దిక్కుల ప్రేక్షకుల్నీ ఊపేసింది. కొత్తగా పెళ్ళయిన జంట మీద వచ్చే ‘ఎందుకంటే ఏమి చెప్పను... ఏమిటంటే ఎలా చెప్పను...’ గీతం యువ ప్రేక్షకుల్ని స్వానుభవాల ఊహలలో తేలియాడించింది. వెరసి, ‘పూతరేకుల తీయదనం... పాలమీగడ కమ్మదనం’ నిండిన సినారె సాహిత్యం, కె.వి. మహదేవన్ సంగీతం, విశ్వనాథ్ మార్కు సంగీత – సాహిత్యాభిరుచి త్రివేణీ సంగమమై, పాటల పల్లకీలో ఈ మ్యూజికల్ హిట్ చిత్రాన్ని ఊరూరా బాక్సాఫీస్ వద్ద ఊరేగించాయి.
దర్శకేంద్రుణ్ణి వెనక్కి నెట్టిన కళాతపస్వి!
సరిగ్గా ఆ ఏడాదే, అదీ శోభన్బాబు హీరోగానే ‘బాబు’ చిత్రంతో కె. రాఘవేంద్రరావు దర్శకుడయ్యారు. ‘జీవనజ్యోతి’కి సరిగ్గా 14 రోజుల ముందు 1975 మే 2న ఆ సినిమా రిలీజైంది. భారీ తారాగణం, ఖరీదైన సెట్లతో సహా అన్ని రకాల హంగులు, ‘ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను గుడిలోన...’ లాంటి పాపులర్ పాటలతో ఆ చిత్రం రిలీజైంది. కొత్త దర్శకుడైనా, ఖరీదైన టేకింగ్తో సినిమా ఫరవాలేదని అనిపించుకుంటున్న తరుణంలో సరిగ్గా 2 వారాలకు శోభన్బాబే నటించిన కె.విశ్వనాథ్ ‘జీవనజ్యోతి’ అనుకోని పోటీగా అవతరించింది. మనసుకు పట్టే పాటలు, మహిళల్ని కట్టిపడేసే సెంటిమెంట్తో ‘జీవనజ్యోతి’ సమకాలపు సినిమాలన్నిటినీ చిత్తు చేసి, బాక్సాఫీస్ విన్నరైంది. ఇంకా చెప్పాలంటే, ఆ ఏడాది తెలుగులో వచ్చిన చిత్రాలన్నిటిలోకీ అత్యధిక వసూళ్ళు ఆ సినిమావే!
‘‘అప్పట్లో విశ్వనాథ్ గారి ‘జీవనజ్యోతి’ హోరులో నా తొలిచిత్రం ‘బాబు’ అడ్రస్ గల్లంతైంది’’ అని రాఘవేంద్రరావే స్వయంగా అంగీకరించారు. కలెక్షన్ల రీత్యా ‘బాబు’ యావరేజ్ సినిమాగా నిలిచినా, మితిమీరిన చిత్ర నిర్మాణ వ్యయం కారణంగా ట్రేడ్ లెక్కలో ఆ సినిమా ఫెయిల్యూర్గా మిగిలింది. తర్వాతి కాలంలో అదే రాఘవేంద్రరావు వసూళ్ళవర్షం కురిపించే కమర్షియల్, మాస్ చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అదే కె. విశ్వనాథ్ అభిరుచి గల కళాత్మక చిత్రాలతోనూ కాసులు కురిపించిన సినీ తపస్విగా సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. అదీ విశేషం.
సిల్వర్ జూబ్లీ సూపర్హిట్ ‘జ్యోతి’!
ఆ రోజుల్లో ‘జీవనజ్యోతి’ మొత్తం 32 కేంద్రాల్లో రిలీజై, అశేష ప్రేక్షకాదరణతో ఏకంగా 31 సెంటర్లలో 50 రోజులు ఆడింది. అదే ఊపులో 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. నిజానికి, మరిన్ని కేంద్రాల్లో నూరు రోజుల పండుగ చేసుకోవాల్సి ఉన్నా, దిగువ కేంద్రాలకు త్వరగా కొత్త సినిమా పంపడం కోసం పంపిణీదారులైన విజయా పిక్చర్స్ వారి పద్ధతైన 50 – 50 శాతం షేర్ వసూళ్ళ షరతు అవరోధమైంది. అలా కొన్ని సెంటర్లలో 80, 90 రోజులు పూర్తయ్యాక కూడా శతదినోత్సవ ఘనత రాకుండానే ‘జీవనజ్యోతి’ని థియేటర్ నుంచి తప్పించిన తార్కాణాలున్నాయి. ఏమైనా, హైదరాబాద్లో మాత్రం ఈ చిత్రం షిఫ్టులతో 25 వారాలు నడిచింది. హైదరాబాద్లోని అమీర్పేటలో విజయలక్ష్మీ టాకీస్లో ఆ ఏడాది నవంబర్ 6న అలా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది.
‘జీవనజ్యోతి’ తర్వాత ఏడు నెలలకు 1975లోనే డిసెంబర్లో వచ్చిన శోభన్బాబు ‘సోగ్గాడు’ సైతం పెద్ద హిట్. అది కూడా 32 కేంద్రాల్లోనే రిలీజై, 31 కేంద్రాల్లో 50 రోజులు జరుపుకోవడం విశేషం. అయితే, ఆ చిత్రం 19 సెంటర్లలో వంద రోజులాడినా, రజతోత్సవ ఘనత దక్కలేదు. చాలామందికి తెలియనిదేమిటంటే, శోభన్ కెరీర్లో అతి పెద్ద కమర్షియల్ హిట్ అని అందరూ అనుకొనే ‘సోగ్గాడు’ కన్నా ‘జీవనజ్యోతి’దే వసూళ్ళలో పైచేయి. ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. టికెట్ రేట్లు ఎక్కువుండే ఏసీ, డీలక్స్ థియేటర్లలో ‘సోగ్గాడు’ రిలీజైన కాకినాడ, నెల్లూరు టౌన్లను మినహాయిస్తే, మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఎక్కువ వసూళ్ళు వచ్చింది – ‘జీవనజ్యోతి’కే!
‘జీవనజ్యోతి’ వసూళ్ళ రేంజ్ అదీ!
ఈ చిత్రం హిట్ రేంజ్కు మచ్చుకు ఓ ఉదాహరణ – కీలకమైన గుంటూరు కేంద్రం బాక్సాఫీస్ కథ. చలనచిత్ర చరిత్రలో... గుంటూరు టౌన్లో రూ. 4 లక్షల పైచిలుకు వసూలు చేసిన మొట్టమొదటి సినిమా – ఈ ‘జీవనజ్యోతే’. ఆ తర్వాత మళ్ళీ రెండేళ్ళకు ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ (1977) అంతటి వసూళ్ళతో, ఆ ఘనత సాధించిన రెండో సినిమా అయింది. విశేషం ఏమిటంటే, మిగతా హీరోలంతా గుంటూరులో ఆ మైలురాయి వసూళ్ళకు చేరుకోవడానికి దాదాపు అయిదారేళ్ళ సమయం పట్టింది. కృష్ణకు ‘ఊరుకి మొనగాడు’ (1981), కృష్ణంరాజుకి ‘సీతారాములు’ (1980), ఏయన్నార్కి ‘ప్రేమాభిషేకం’ (1981) వచ్చేవరకు గుంటూరులో ఆ 4 లక్షల మైలురాయి లేదన్నది బాక్సాఫీస్ విశ్లేషకుల మాట. సాక్షాత్తూ శోభన్బాబు సైతం ‘జీవనజ్యోతి’ తర్వాత ఏడేళ్ళకు ‘దేవత’ (1982 సెప్టెంబర్ 10 రిలీజ్) వచ్చేవరకు మరోసారి ఆ రూ. 4 లక్షల ఘనత గుంటూరులో సాధించలేదు. అయితే, ఆ నడిమధ్య కాలంలో ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు మాత్రం రూ. 4 లక్షల‡మైలురాయిని దాటి, వసూలు చేశాయి. అదీ ‘జీవనజ్యోతి’ హిట్ రేంజ్!
శోభన్బాబు కెరీర్లో టాప్ ఇయర్!
స్వీయ నిబంధనలకు తగ్గట్టు నటించి, ఇంకా క్రేజ్, ఇమేజ్ ఉన్నా సరే సొంత ఆలోచనలకు తగ్గట్టే నటన విరమించిన అందాల నటుడు, ‘నటభూషణ’ శోభన్బాబుది చిరస్మరణీయమైన సినీ జీవితం. అంతటి కెరీర్లోనూ ఆయనకు శిఖరాయమాన సంవత్సరమంటే – ‘జీవనజ్యోతి’ రిలీజైన 1975యే! టాప్ హీరో ఎన్టీఆర్ గణనీయమైన సంఖ్యలో సినిమాలు చేస్తున్నా, హిట్లూ – కలెక్షన్లూ వస్తూనే ఉన్నా, జనం ఆగి అబ్బురపడేటంత భారీ బాక్సాఫీస్ హిట్లు రాని ఏడాది అది. మరో అగ్రహీరో ఏయన్నార్ అంతకు ముందే అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చారు. సినిమాలకు విరామమిచ్చి, పూర్తిగా విశ్రాంతి తీసుకోవడంతో, ఆ ఏడాది ఆయనకు రిలీజులే లేవు. శోభన్కు సాటివాడైన హీరో కృష్ణ చకచకా సినిమాలు చేస్తున్నప్పటికీ, క్రిందటేడు ‘అల్లూరి సీతారామరాజు’ (1974) తెచ్చిన ఇమేజ్ దెబ్బతో, ‘పాడిపంటలు’ (1976) వరకు సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవుతున్న విచిత్రమైన సంవత్సరం అది.
అలాంటి చిత్రమైన సందర్భంలో శోభన్బాబు పట్టిందల్లా బంగారమైంది. ఆ 1975లో శోభన్ సినిమాలు మొత్తం 8 రిలీజయ్యాయి. అందులో 5 (‘దేవుడు చేసిన పెళ్ళి’, ‘జీవనజ్యోతి’, ‘బలిపీఠం’, ‘జేబుదొంగ’, ‘సోగ్గాడు’) హిట్లు . రెండే (‘గుణవంతుడు’, ‘అందరూ మంచివారే’) ఫ్లాపులు. ఒకటి మాత్రం (‘బాబు’) యావరేజ్. అయిదు హిట్లలోనూ ‘జీవనజ్యోతి’ ఒకటే 25 వారాలు ఆడి, సిల్వర్జూబ్లీ చేసుకుంది. ఏయన్నార్కి పర్మినెంట్ నిర్మాతైన డి. రామానాయుడు తీసిన ‘సోగ్గాడు’ సైతం రజతోత్సవానికి ఒక వారం ముందే థియేటర్ల నుంచి వైదొలగింది. అలా ఒకే ఏడాది అధికశాతం కమర్షియల్ సక్సెస్లతో శోభన్బాబు క్రేజు పెరిగిపోయింది. పరిశ్రమలో ఆయన రేంజే మారిపోయింది.
హిందీలోనూ హిట్టయిన మదర్ సెంటిమెంట్!
బాక్సాఫీస్ రికార్డులే కాదు... విమర్శకుల రివార్డులు, ప్రభుత్వ – ప్రైవేటు అవార్డుల్లోనూ ‘జీవనజ్యోతి’కి అగ్రతాంబూలం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది అవార్డుల్లో ఆ ఏడాదికి బంగారు నంది అందుకున్న ఉత్తమ చిత్రం అదే! (అప్పటికింకా వ్యక్తిగత విభాగాల్లో ప్రత్యేకంగా నంది అవార్డులు ఇవ్వడమనే ఆనవాయితీ లేదు. ఉత్తమ చిత్రం అవార్డు కింద నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లను అందరినీ గౌరవించేవారు. అలా ‘జీవనజ్యోతి’ ప్రధాన బృందం అంతటికీ గౌరవం దక్కింది). ఇక, పాపులర్ అవార్డులైన ‘ఫిల్మ్ఫేర్’లోనూ దక్షిణాదిన ఈ సినిమాదే హవా. ఉత్తమ తెలుగు సినిమా, ఉత్తమ దర్శకుడు (కె. విశ్వనాథ్), ఉత్తమ నటుడు (శోభన్బాబు), ఉత్తమ నటి (వాణిశ్రీ)... ఇలా అవార్డుల పంట పండింది. ఇదే సినిమా దశాబ్ద కాలం తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలోనే హిందీలో జితేంద్ర, జయప్రదలతో ‘సన్జోగ్’ (1985)గా రీమేకైంది. అక్కడా ఈ కథ హిట్. కథానాయికగా జయప్రదకు మంచి పేరు తెచ్చింది. ఉత్తమ నటిగా ఆమె ‘ఫిల్మ్ఫేర్’కు నామినేటైంది. చిత్రమేమంటే, ఈ తెలుగు సూపర్హిట్ సినిమా 21 ఏళ్ళ తర్వాత కన్నడంలోనూ వచ్చింది. విష్ణువర్ధన్, ఆమనితో ‘బాళిన జ్యోతి’ (1996)గా క్రాంతికుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది.
‘లేడీస్ స్పెషల్ షో’ ట్రెండ్!
విశేషమేమిటంటే, అదే ఏడాది ప్రపంచ మహిళా సంవత్సరం. ఈ సెంటిమెంట్ సినిమాకు స్త్రీలు పోటెత్తడంతో, కొన్ని తరగతుల టికెట్లు, కొన్ని షోలు ఆడవారికే ప్రత్యేకంగా కేటాయించేవారు. మూకీలు పోయి టాకీలొచ్చాక, తెలుగు సినిమా ఆధునికతను సంతరించుకున్నాక ఈ ‘లేడీస్ స్పెషల్ షో’ ట్రెండ్కూ ఈ ‘జీవనజ్యోతే’ నాంది!
ప్రాంతాలు, భాషల తేడా లేకుండా ‘జీవనజ్యోతి’లోని సార్వత్రికమైన తల్లి సెంటిమెంట్ అన్నిచోట్లా పండింది. ఆ సింపుల్ సెంటిమెంట్ కథ... విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ, వాణిశ్రీ అభినయ వైదుష్యం, అందాల శోభన్బాబు క్రేజీ ఇమేజ్, పదే పదే పాడుకోవాలనిపించే పాటలతో ఇవాళ తెరపై చూసినా తాజాగా అనిపించడం చెప్పుకోదగ్గ గొప్పదనం.
– రెంటాల జయదేవ