బాలీవుడ్‌ అమ్ముడు పోయింది.. ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు! | Prakash Raj Slams Hindi Film Industry For Not Speaking On Political Issue, Check His Comments Inside | Sakshi
Sakshi News home page

సగం మంది అమ్ముడు పోయారు.. ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు!

May 6 2025 1:48 PM | Updated on May 6 2025 3:41 PM

Prakash Raj slams Hindi Film Industry For Not Speaking On Political Issue

ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌(Prakash Raj ) బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో సగం మంది నటీనటులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, అందుకే వారు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించే ప్రకాశ్‌ రాజ్‌, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి కారణాలను వివరించారు.

“నేను సూటిగా మాట్లాడతాను. రాజకీయ పరిణామాలపై నా అభిప్రాయాన్ని బహిరంగంగా చెబుతుంటాను. దీని వల్ల భవిష్యత్తులో తమకు ఇబ్బందులు వస్తాయని భావించి, నాకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసిన తర్వాతే నేను గళం విప్పాలని నిర్ణయించుకున్నాను,” అని ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నించాలనే ఆలోచన చాలా మందిలో ఉన్నప్పటికీ, ధైర్యంతో ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“సినిమా పరిశ్రమలో సగం మంది అమ్ముడుపోయినవారే. కొంతమంది మంచివారు ఉన్నప్పటికీ, ప్రశ్నించే ధైర్యం లేదు. నా సన్నిహిత మిత్రుడు ఒకరు, ‘ప్రకాశ్‌, నీకు ధైర్యం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నావ్‌, మాకు అంత ధైర్యం లేదు’ అని చెప్పారు. వారి పరస్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ, చరిత్ర నేరాలు చేసిన వారిని క్షమించినా, మౌనంగా ఉండేవారిని మాత్రం క్షమించదు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి,” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రకాశ్‌ రాజ్‌ ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన తాజాగా సూర్య నటించిన ‘రెట్రో’ చిత్రంలో కనిపించారు. పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘ఓజీ’, విజయ్‌ నటిస్తున్న ‘జన నాయగన్‌’ చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement