భర్త గురించి భయంకర విషయాలు చెప్పిన పూనమ్‌‌

Poonam Pandey Revealed All About What Happened In Goa - Sakshi

నన్ను జంతువులా కొట్టాడు

ఆ సమయంలో చనిపోతానేమో అనుకున్నా

ఇక్కడితో మా పెళ్లికి ముగింపు

ముంబై: పెళ్లి అయి పట్టుమని నెల రోజులు కాలేదు అప్పుడే భర్త వేధిస్తున్నాడంటూ కేసు పెట్టి రచ్చకెక్కారు నటి, మోడల్‌ పూనమ్‌ పాండే. కొంత కాలంగా తన భాయ్‌ఫ్రెండ్‌ సామ్‌ బాంబేను గాఢంగా ప్రేమించిన పూనమ్‌ పామ్‌ ఈనెల 1వ తేదిన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తన భర్త వేధిస్తున్నాడని, శారీరక దాడికి పాల్పడుతున్నాడని పూనమ్‌ సామ్‌పై గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సినిమా షూటింగ్‌ కోసం గోవా వెళ్లిన ఈ బ్యూటీ అక్కడే స్థానిక పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు భర్త సామ్‌ బాంబేను గోవా పోలీసులు సెప్టెంబర్‌ 22న అరెస్టు చేశారు. అయితే ఆ మరుసటి రోజే సెప్టెంబర్‌ 23న బాంబేకు గోవా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భర్తపై ఫిర్యాదు చేయడంపై వివరణ ఇచ్చారు పూనమ్‌. (పూనమ్‌ భర్తకు బెయిల్‌ మంజూరు)

సామ్‌తో బంధం ఎప్పుడూ హింసాత్మకంగానే ఉండేదని. అయితే పెళ్లి చేసుకోవడం వల్ల అతనిలో మార్పు వస్తుందేమోనని భావించినట్లు వెల్లడించారు. సామ్ తన విషయంలో ఆధిపత్యం చేలాయించేవాడని, చిన్న విషయాలకే ఆవేశపడుతుంటాడని పేర్కొన్నారు. గోవాలో జరిగిన విషయాల గురించి పూనమ్ మాట్లాడుతూ.. ‘సామ్‌కు నాకు ఓ విషయంలో వాదన మొదలైంది. అది మెల్లమెల్లగా పెరిగి గొడవలా మారింది. ఈ క్రమంలో అతను నన్ను కొట్టడం ప్రారంభించాడు. నన్ను అనేక రకాలుగా హింసించాడు. నా ముఖంపై పిడికిలితో గుద్దాడు. నా జుట్టు పట్టుకొని లాకెళ్లి మంచం మూలపై తలతో కొట్టాడు. ఆ సమయంలో నేను చనిపోతానేమో అనుకున్నాను. కానీ ఏదో విధంగా అక్కడి నుంచి బయటపడగలిగాను. హోటల్‌ సిబ్బంది సహాయంతో పోలీసులను సంప్రదించాను. అప్పుడు అతన్ని తీసుకెళ్లాను. నేను సామ్‌పై కేసు పెట్టాన’ని తెలిపారు. (పెళ్లి విషయం దాచాలనుకోలేదు)

తనను ఓ జంతువులా కొట్టడంతో ఇక తన వైవాహిక జీవితాన్ని ముగించుకుంటానని ఆమె తెలిపారు. ఇక తన దగ్గరకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘నన్ను జంతువులాగా కొట్టిన వ్యక్తి దగ్గరికి తిరిగి వెళ్లాలన్న ఆలోచన లేదు. మా బంధాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి రిలేషన్‌లో ఉండటం కంటే నేను ఒంటరిగా ఉండటం మేలు. ఇక్కడితో మా పెళ్లికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను’ అని వెల్లడించారు. కాగా మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్‌  2013లో ‘నాషా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. ఈ ఏడాది జూలై 27న బాయ్‌ప్రెండ్‌ సామ్‌తో పూనమ్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. సుమారు రెండేళ్లుగా సామ్‌తో సహజీవనం చేసి పూనమ్ బాంద్రాలోని వారి ఇంటిలో వివాహం చేసుకున్నారు. (ఏడడుగులు వేసిన వేళ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top