
‘పైడి’ పేరున సినీ అవార్డు
సిరిసిల్లకు చెందిన తొలితరం నటుడు, దర్శకుడు పైడి జైరాజ్
ఉమ్మడి జిల్లా ప్రజల హర్షం.. రవిచంద్రకు గద్దర్ అవార్డు
భారతీయ సినిమా మాటలు నేర్వకముందే అంటే మూకీయుగంలోనే పైడి జైరాజ్ సినీ ప్రయాణం మొదలైంది. భారత తొలి మాటల చిత్రం అలం ఆరా (1931) సినిమాతో తనదైన ముద్ర వేసిన పైడి జైరాజ్ హిందీలో కూడా గుర్తింపు పొందారు. నేడు (జూన్ 14)న తెలంగాణ సర్కారు ఆయన పేరుతో అవార్డు ప్రదానం చేస్తోంది. హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ఈ అవార్డు అందించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లకు చెందిన పైడి జైరాజ్ సెప్టెంబర్ 28, 1909లో జన్మించారు. పంజాబీ అయిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. 2000 ఆగస్టు 11న ఆయన మరణించారు. సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో అందుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. 11 మూకీ సినిమాల్లో 156 టాకీ సినిమాల్లో హీరోగా, 300 సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.

1929లో బొంబాయికి
నిజాం కళాశాలలో గ్రాడ్యుయేట్ చదువుతున్న సమయంలో జైరాజ్ నాటకలు, సినిమాలపై ఆసక్తితో 1929లో బొంబాయి వెళ్లారు. స్టార్క్లింగ్ యూత్ అనే నిశ్శబ్ద చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ట్రయాంగిల్ ఆఫ్ లవ్, మాతభూమి, ఆల్ ఫర్ లవర్, మహాసాగర్ మోతి, ఫ్లైట్ ఇన్టు డెత్, మై హీరో మొదలైన పదకొండు నిశ్శబ్ద చిత్రాల్లో నటించాడు. శాంతారామ్, అశోక్ కుమార్, పథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ వంటి వారితో ఏడు దశాబ్దాల పాటు కొనసాగారు. నిరూపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ల సరసన నటించారు. 86ఏళ్ల వయసులో 1995లో గన్ అండ్ గాడ్ సినిమా తరువాత సినీరంగం నుంచి తప్పుకున్నారు. టాకీకాలంలో మోహర్, మాల, ప్రతిమ, రాజ్ఘర్, సాగర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అమర్సింగ్ రాథోడ్, పథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్, షాజహాన్, టిప్పు సుత్తాన్, హైదర్ ఆలీ వంటి పా త్రలు పోషించిన ఆయన హిందీ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, మలయాళం తదితర భాషా చిత్రాల్లో నటించారు. తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
పైడి జైరాజ్ సినీ పురస్కారం
రాష్ట్ర విభజన నాటి నుంచి 2014–2024 మధ్యలో విడుదలైన చిత్రాలకు గద్దర్ పేరున తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రభుత్వం ఇవ్వనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డులైన రఘుపతి వెంకయ్య, బీఎన్రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులకు తోడు తెలంగాణకు చెందిన పైడి జైరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనుంది. సిరిసిల్లకు చెందిన పైడి జైరాజ్ పేరున తొలిసారిగా అవార్డు ప్రకటించగా, ఈనెల 14న ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ప్రదానం చేయనున్నారు.
తెలుగు సినిమాల సమీక్షల్లో తనదైన ముద్ర వేసి, సినీ రంగం పైన అనేక వ్యాసాలు, పుస్తకాలు రాసిన కరీంనగర్ ఫిల్మీ సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర పైడి జైరాజ్పై నిర్మించిన డాక్యుమెంటరీ గాను 2024 సంవత్సరానికి బెస్ట్ ఫిలిం క్రిటిక్గా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డును శనివారం హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో రవిచంద్ర అందుకోనున్నారు. అవార్డు అందుకుంటున్న సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల జాయింట్ సెక్రటరీ జీవీ శ్యాంప్రసాద్లాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీ బాధ్యులు లక్ష్మీ గౌతమ్, మాడిశెట్టి గోపాల్, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, కోల రామచంద్రారెడ్డి, వారాల మహేశ్ తదితరులు అభినందించారు.