బలగం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వేణు యెల్దండి చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘ఎల్లమ్మ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. ఇంకా చెప్పాలంటే..ఈ పాటికి షూటింగ్ కూడా పూర్తయి..రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ పలు కారణాలతో షూటింగ్ వాయిదా పడింది. తొలుత ఈ కథను హీరో నానితో చేయాలనుకున్నాడు. కానీ ఆయన బిజీ కావడంతో నితిన్తో తెరకెక్కించాలనుకున్నారు.
ఈ మేరకు నిర్మాత దిల్ రాజు అధికారికంగా నితిన్ పేరుని ప్రకటించాడు కూడా. కానీ తమ్ముడు సినిమా రిలీజ్ తర్వాత నితిన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. కానీ చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. విడుదల చేసిన గ్లింప్స్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా మొత్తానికి వేణు ఎల్లమ్మ కథకి హీరో అయితే ఫిక్స్ అయ్యాడు. కానీ,ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు.
టైటిల్ మాదిరే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రే చాలా బలంగా ఉండబోతుందట. అందుకే ఓ స్టార్ హీరోయిన్ని పెట్టుకోవాలని వేణు, దిల్ రాజు భావిస్తున్నారట. గతంలో సాయి పల్లవి, కీర్తి సురేశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వాళ్లిద్దరు నో చెప్పేశారట. ఇక ఇప్పుడు ఎల్లమ్మ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ని ఒప్పించినట్లు సమాచారం.'సీతారామం'లో సీతగా తెలుగు ఆడియన్స్ మనసు దోచేసిన మృణాల్.. ఎల్లమ్మ కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.
అయితే పారితోషికం కాస్త పెంచమని చెప్పినట్లు సమాచారం. డెకాయిట్ కోసం ఆమె దాదాపు రూ.2.5 కోట్ల వరకు తీసుకుంది. ఇక ఎల్లమ్మ కోసం రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తుంది. ప్రస్తుతం పారితోషికం విషయంలో చర్చలు జరుగుతున్నాయట. అన్నీ ఓకే అయిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


