దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ వారణాసి. మహేశ్బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారు. 2025 చివర్లో వారణాసి గ్లింప్స్ రిలీజ్ చేయగా మూవీకి భారీ హైప్ వచ్చింది. ఈ మధ్యే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా చిత్రయూనిట్ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది.
స్టార్గా మారిందే ఆ సినిమాతో
అందులో మహేశ్బాబు తనకు స్టార్డమ్ తెచ్చిన సినిమా ఏదో వెల్లడించాడు. అలాగే వారణాసిలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. 'పోకిరి సినిమా నన్ను స్టార్గా నిలబెట్టింది. ఆ మూవీ చాలా పెద్ద విజయం సాధించింది. వారణాసి విషయానికి వస్తే.. రాజమౌళి నాకు ఈ కథ చెప్పగానే ఆశ్చర్యపోయాను. తర్వాత ఓసారి.. మీ దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది. మీరు హీరోలను చాలా బాగా చూపిస్తారు, మీకు హీరోలంటే చాలా ప్రేమ అని రాజమౌళికి మెసేజ్ పెట్టాను. అందుకాయన థాంక్యూ, కానీ నా సినిమాల్లో నాకు విలన్లంటేనే ఎక్కువ ఇష్టం అని రిప్లై ఇచ్చాడు.
మొదట్లో భయపడ్డా..
రాజమౌళి అభిమానిగా నేను కూడా వారణాసి మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇందులో హీరోగా చేయడానికి నేను మొదట్లో భయపడ్డాను. కానీ ఆయన కథను వివరించి చెప్పాక ఆ భయం పోయింది. ఇందులో రాముడి పాత్ర పోషించాను. రాముడు అంటేనే హుందాతనం. నిలబడే దగ్గరనుంచి పాత్రలో నటించేవరకు ఎన్నో రిహార్సల్స్ చేశాం అని చెప్పాడు. తనకు ఇష్టమైన వంటకం ఏంటని అడగ్గా హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఇష్టమని మహేశ్బాబు తెలిపాడు.


