మహేశ్‌తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్‌పై క్లారిటీ | SS Rajamouli Reacts To Varanasi Two Parts And Working With Mahesh Babu, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Rajamouli Varanasi: 'వారణాసి' నిడివి ఎంతంటే? రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

Feb 4 2026 7:20 AM | Updated on Feb 4 2026 10:15 AM

Rajamouli Reacts Varanasi Two Parts And Working With Mahesh Babu

'ఆర్ఆర్ఆర్' తర్వాత దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న సినిమా 'వారణాసి'. 2024లో షూటింగ్ మొదలైనప్పటికీ.. గతేడాది నవంబరులోనే అన్ని విషయాలు బయటపెట్టారు. టైటిల్‌తో సహా మూవీ ఎలా ఉండబోతుందనే విషయాన్ని గ్లింప్స్ రూపంలో రివీల్ చేశారు. దానికోసం భారీ ఎత్తున ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ టైంలో మహేశ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, రాజమౌళి.. పలు హాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిని ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ చేసేశారు. ఇందులోనే రాజమౌళి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీక్వెల్ అంటూ వస్తున్న రూమర్స్‌పైనా క్లారిటీ ఇచ్చేశారు.

15 ఏళ్ల క్రితమే మహేశ్ బాబు, మీరు కలిసి పనిచేయాలనుకున్నారు? మరి దానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? అనే ప్రశ్నకు బదులిచ్చిన రాజమౌళి.. '2010లో నేను-మహేశ్ మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడే సినిమా చేద్దామని ఫిక్సయ్యాం. కాకపోతే నాకున్న మూడు కమిట్మెంట్స్ పూర్తి చేసి వస్తానని మాటిచ్చాను. ఆరు నెలల్లో ఈగ తీద్దామనుకుంటే రెండేళ్లు పట్టేసింది. రెండేళ్లలో బాహుబలి తీద్దామనుకుంటే మూడేళ్లు పట్టేసింది. కొవిడ్ వల్ల 'ఆర్ఆర్ఆర్' చాలా ఆలస్యమైపోయింది. అందుకే మహేశ్ బాబుతో చేయడానికి ఇన్నేళ్లు పట్టేసింది' అని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చిన రాజమౌళి.. మేం ఆలోచించుకున్న తర్వాత సీక్వెల్ వద్దని డిసైడ్ అయ్యాం. దాదాపు 3 గంటల నిడివితోనే మూవీ థియేటర్లలోకి వస్తుంది అని క్లారిటీ ఇచ్చేశాడు. అలానే ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్.. ఐదు నిమిషాలు బోర్ కొట్టినా సరే ఫోన్ చూసుకుంటాడు. స్టోరీ విషయంలో ప్రేక్షకుడు తల పక్కకు తిప్పకుండా ఉండేలా మూవీని తీస్తున్నాం. అదే అతిపెద్ద ఛాలెంజ్ అని అన్నాడు. 'వారణాసి'లో రామాయణం సీన్స్ ఉండటానికి గల కారణాన్ని కూడా రాజమౌళి వెల్లడించాడు. 'నా సినిమాలన్నీ కూడా రామాయణ, మహాభారత నుంచి స్ఫూర్తి పొందినవే. కానీ ఈసారి స్ఫూర్తి కాకుండా 'రామాయణం' ఓ భాగాన్ని 'వారణాసి'లో చూపించే అవకాశం దొరికింది' అని జక్కన్న అన్నాడు.

మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారులు కాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్..'వారణాసి'లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కీరవాణి సంగీతమందిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. మొన్నటివరకు విడుదల తేదీపై కూడా రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న అంటే ఉగాది సందర్భంగా పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాని విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ బల్లగుద్ది చెప్పింది.

(ఇదీ చదవండి: సె*క్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా తెలుగు హీరో.. టీజర్ రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement