26 ఏళ్ల నాటి అత్యంత ఖరీదైన సినిమా...ఇంకా విడుదల కాలేదు..! | India Most Expensive Film Was Made 26 Years Ago, Never Got released | Sakshi
Sakshi News home page

కమల్‌ సినిమాపై ‘అణు బాంబు’.. ‘అబ్ధుల్‌కలాం’ వల్ల ఆగిపోయింది!

Apr 7 2025 11:17 AM | Updated on Apr 7 2025 11:37 AM

India Most Expensive Film Was Made 26 Years Ago, Never Got released

ప్రస్తుతం అంతా భారీ చిత్రాల ట్రెండ్‌ నడుస్తోంది. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించకపోతే వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల బుర్రలోకెక్కించలేం అన్నట్టుగా ఉంది పరిస్థితి. కధ, కధనాలను బట్టి బడ్జెట్‌ అనడం కన్నా బడ్జెట్‌ను బట్టి కధ అన్నట్టు మారిపోయింది. ఐదూ, పది కోట్లతో తీసే సినిమాల గురించి మాట్లాడుకోవడం కూడా దండగ అన్నట్టుగా నోరెత్తితే భారీ సినిమాలే చర్చకు నోచుకుంటున్నాయి. అయితే భారీ చిత్రాలు అనేవి ఇప్పుడే కాదు ఒకప్పుడూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలు దశాబ్ధాల క్రితమే తలపెట్టారు. అలాంటి ఒక సినిమా, ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే చరిత్రలోనే నెం1 భారీ  చిత్రం అని పేర్కొనదగ్గ సినిమా... పాతికేళ్ల క్రితమే ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా పేరు మరుదనాయగం (Marudhanayagam).

‘మరుదనాయగం‘ అనేది 18వ శతాబ్దపు యోధుడు మహ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌ గురించిన చారిత్రక నాటకం స్ఫూర్తితో తలపెట్టారు.  హిందీ, తమిళం, తెలుగు  ఆంగ్లంతో సహా పలు భాషలలో విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. విశ్వవిఖ్యాత నటుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan) ను  ఎంతో ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మక కాలపు చిత్రం మరుధనాయగం సినిమా 1997లో, తన స్వీయ దర్శకత్వంలో ప్రారంభించారు. బ్రిటన్‌ మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌  అతిధిగా ఇది భారీ స్థాయిలో షూటింగ్‌ ప్రారంభమైంది. దీనికి సుజాత స్క్రిప్ట్‌ రాశారు. నాజర్, సత్యరాజ్, విష్ణువర్ధన్‌ తదితర నటులు కూడా ఈ సినిమాకు ఎంపికయ్యారు.

(చదవండి: ఓటీటీ/ థియేటర్‌లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల)

ప్రత్యేక పాత్రల కోసం అమితాబ్, రజనీకాంత్‌లను కూడా సంప్రదించినప్పటికీ వాళ్లు తిరస్కరించారు. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు కీలకపాత్రలో హాలీవుడ్‌ స్టార్‌ యాక్ట్రెస్‌ కేట్‌ విన్‌స్లెట్‌ ని కూడా అనుకున్నారు. సినిమా టెస్ట్‌ షూట్‌ కోసం, కమల్‌ హాసన్‌ మాజీ భార్య, నటి సారిక బ్రిటీష్‌  ఫ్రెంచ్‌ సైన్యం అధికారులతో పాటు హిందూ  ముస్లిం యోధులను ప్రతిబింబించేలా 7,400 వరకు దుస్తులు  ఉపకరణాలను తయారు చేయించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో రూ.1 కోటి ఖర్చుతో టెస్ట్‌ షూట్‌ చేశారు. అప్పట్లోనే ఈ సినిమాకు రూ.80 నుంచి 90 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు..అంటే ప్రస్తుతం లెక్కల ప్రకారం చూస్తే...ఇది రూ..650 కోట్ల వరకూ ఉండొచ్చు.

(చదవండి: ఎన్టీఆర్‌ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్‌’ అంటే షాకయ్యా: రాజీవ్‌)

అట్టహాసంగా అతిరధుల సమక్షంలో ప్రారంభమైన ఈ సినిమా,30 నిమిషాల రన్‌ టైమ్‌ పూర్తయిన తర్వాత 1998 చివరలో  షూటింగ్‌ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని సహ–నిర్మాతగా నిర్మించాలని అనుకున్న ఒక బ్రిటిష్‌ కంపెనీ, అర్ధంతరంగా వెనక్కి తగ్గడంతో, మరుధనాయగం పనులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. బ్రిటీష్‌ నిర్మాణ సంస్థ ఉపసంహరణ కారణంగా ఏర్పడిన ఆర్థిక పరిమితులు అడ్డంకిగా మారాయి. ఈ సినిమా పూర్తి కాలేదు... ఇప్పటికీ విడుదల కాలేదు, ప్రాజెక్ట్‌ ఎక్కడిది అక్కడే ఉండిపోయింది. ఆ బ్రిటిష్‌ కంపెనీ ఉపసంహరించుకోకుంటే ఈ సినిమా ఖచ్చితంగా పూర్తయి విడుదలై ఉండేది ఎన్నో సంచలనాలు నమోదు చేసేది.

ఆ బ్రిటిష్‌ కంపెనీ సినిమా  నిర్మాణం నుంచి ఉపసంహరించుకోవడానికి కారణం భారతదేశంలో జరిగిన పోఖ్రాన్‌ అణు బాంబు పరీక్ష . అంటే  కమల్‌ సినిమా ఆగిపోవడానికి మన భారతరత్న నాటి అణు పరీక్షల సారధి అబ్ధుల్‌ కలాం పరోక్షంగా కారణం అయ్యారన్నమాట. అయితే అది తన  కలల ప్రాజెక్ట్‌ అని కమల్‌ హాసన్‌ చెబుతుంటారు. కానీ ఇప్పుడు గానీ  ఆ సినిమా స్క్రిప్ట్‌ను పునరుద్ధరించాలంటే గణనీయమైన మార్పులతో పాటు, దీనికి ఓ యువ కథానాయకుడు అవసరమని కమల్‌ హాసన్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  చూడాలి మరి ఈ సినిమా ఎప్పటికైనా తెరకెక్కుతుందో లేదో....
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement