డైరెక్టర్‌ టచ్‌ చేయనిచ్చేవాడే కాదు: యానిమల్‌ నటులు | Sakshi
Sakshi News home page

Sandeep Reddy Vanga: లుక్‌ టెస్ట్‌.. దానికి సందీప్‌ రెడ్డి ఒప్పుకోలేదన్న యానిమల్‌ నటులు

Published Fri, Jan 12 2024 5:02 PM

Animal Actors Recall Sandeep Reddy Vanga Told Makeup Artist to Not Touch Our Beard - Sakshi

యానిమల్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాకు సిక్కులంటే ఎంతో అభిమానం, గౌరవమట. సిక్కులను సినిమాలో చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడట. ఈ విషయాన్ని యానిమల్‌ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన అమంజోత్‌ సింగ్‌, మంజోత్‌ సింగ్‌, విక్రమ్‌ బక్షి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ముగ్గురూ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ కజిన్లుగా నటించారు. బల్బీర్‌ సింగ్‌(అనిల్‌ కపూర్‌)కు ఆపదలో ఉన్నాడని తెలియగానే పంజాబ్‌ నుంచి ఢిల్లీ వెళ్లి ఆయనకు రక్షణగా నిలబడతారు. తాజాగా ఈ ముగ్గురు ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

సందీప్‌ స్వయంగా చెప్పాడు
ఈ సందర్భంగా అమంజోత్‌ మాట్లాడుతూ.. 'సర్దార్లు కామెడీ పాత్రల కోసం పుట్టలేదు. వారి యాటిట్యూడ్‌, స్వభావం, పోరాట చరిత్ర.. అదంతా కామెడీ కాదు. వారిని నేను కమెడియన్లలా చూపించలేను అని దర్శకుడు సందీప్‌ స్వయంగా నాతో చెప్పాడు. హీరోలుగా చూపించాల్సిన వారిని కామెడీ పీసులుగా మార్చడం ఇష్టం లేదన్నాడు. కాలేజీలో తనకు పంజాబీ స్నేహితులు ఎక్కువగా ఉండేవారట. అలా సిక్కుల గురించి ఆయన బాగా తెలుసుకున్నాడు' అని చెప్పాడు.

సీరియస్‌ పాత్రల్లో సిక్కులు కనిపించి ఎన్నాళ్లయిందో!
విక్రమ్‌ బక్షి మాట్లాడుతూ.. 'సీరియస్‌గా కనిపించే సిక్కు పాత్రను చివరిసారిగా ఎప్పుడు చూశారో మీకేమైనా గుర్తుందా? గుర్తు రావడం లేదు కదూ.. సినిమాలో మేము పరిస్థితులను బట్టి అక్కడక్కడా సరదాగా కామెడీ పండించాము. అంతేకానీ వెకిలి కామెడీ మాత్రం చేయలేదు' అన్నాడు. ఇంతలో మంజోత్‌ సింగ్‌ మధ్యలో కల్పించుకుంటూ.. 'ఏదైనా సన్నివేశం షూట్‌ చేసేముందు చాలాసార్లు అతడు మా అనుమతి కోరేవారు. సినిమా లుక్‌ టెస్ట్‌ కోసం వెళ్లినప్పుడు అక్కడి మేకప్‌ ఆర్టిస్ట్‌, హెయిర్‌ స్టయిలిస్ట్‌ రెబెకా.. నా ముఖం మీదున్న వెంట్రుకలు తీసేయాలన్నాడు. 

గడ్డం తీసేయమంటే..
అలాగే నా గడ్డం వైపు చూపిస్తూ అది కొంత తీసేయాలన్నాడు. సందీప్‌ అందుకు ఒప్పుకోలేదు. గడ్డాన్ని తాకడానికే వీల్లేదన్నాడు. దాన్ని అలాగే ఉండనీయమన్నాడు. మాకు చాలా స్వేచ్ఛను ఇచ్చాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా యానిమల్‌ విషయానికి వస్తే ఈ మూవీ డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా రాబట్టింది.

చదవండి: ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన మహేశ్‌.. డల్‌గా కనిపించిన సూపర్‌స్టార్‌

whatsapp channel
 

Advertisement

తప్పక చదవండి

Advertisement