
నటనకు ఎల్లలు ఎలాగైతే లేవో ప్రేమకు సరిహద్దులు ఉండవు. దీనికి చిన్న ఉదాహరణ నటుడు ఆర్య, నటి ఆయేషాసైగల్. ప్రేమబంధం ఎప్పుడు ఎవరితో ముడిపడుతుందో ఎవరికి తెలియదు. కోలీవుడ్లో ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న ఆర్యకు, బాలీవుడ్ భామ ఆయేషా సైగల్కు (Sayyeshaa Saigal) అలా ప్రేమబంధం ముడిపడింది. అఖిల్ అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయికిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీని దర్శకుడు విజయ్ కోలీవుడ్కు పరిచయం చేశారు. నటుడు రవిమోహన్కు జంటగా వనమగన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినా, ఆయేషా సైగల్ మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు.
అయితే ఆ తరువాత తమిళంతో పాటు కన్నడం, హిందీ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్ ఇమేజ్ను అందుకోలేకపోయారు. కాగా ఆర్యకు జంటగా గజినీకాంత్ చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆయనతో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇరు కుటుంబసభ్యుల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. వివాహనంతరం ఆయేషా సైగల్ నటనకు బ్రేక్ ఇచ్చారు. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. దీంతో ఆయేషా సైగల్ మళ్లీ నటనపై దృష్టి సారించారు. అందుకోసం తన వంతు ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. అందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు.

మరో విషయం ఏమిటంటే ఆయేషా సైగల్ మంచి డాన్సర్. తన డాన్స్ రీల్స్ను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు పని చెబుతూ ఉంటారు. అలా తాజాగా ఈమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. 2013లో విడుదలైన రేస్–2 చిత్రంలోని లాట్ లక్ కయీ అనే పాటకు ఆమె డాన్స్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు అమ్మ అయితే మాత్రం డాన్స్ ఆడకూడదా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్వరలో ఆర్య, ఆయేషా జంటగా కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం.