తమిళ సినీ ప్రపంచంలో మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ విలన్గా, సహనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. లియో మూవీ విడుదల తర్వాత నటి త్రిషపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడు. అయితే, ఆయన కుమారుడు తుగ్లక్ తన కారులో చెన్నై హాడోస్ రోడ్డు నుండి ఉత్తమర్ గాంధీ రోడ్డు వైపు వెళ్తుండగా..అకస్మాత్తుగా అదుపు తప్పి శాస్త్రి భవన్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆపై బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా, కారులో ఉన్న తుగ్లక్ స్వల్ప గాయాలతో కిందపడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని రక్షించి, ఘటన స్థలంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మైలాపూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రమాదం జరిగినప్పుడు తుగ్లక్ మద్యం సేవించలేదని తెలిసింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గత సంవత్సరం మాదకద్రవ్యాలు ఉపయోగించినందుకు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు తుగ్లక్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం గమనార్హం.


