మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
తునికిబొల్లారంలో
‘బేకర్ హ్యూస్’ ప్రారంభం
ములుగు(గజ్వేల్): పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. తునికిబొల్లారం ఇండస్ట్రియల్ పార్కులో ‘ది ఎక్స్క్లూజీవ్ లీన్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ బేకర్ హ్యూస్’ కంపెనీని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ అమెరికాకు చెందిన గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ బేకర్ హ్యూస్ కంపెనీ ఆయా రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. తాజాగా ప్రారంభమైన బేకర్ హ్యూస్ ఇండస్ట్రీయల్ ఎనర్జీ టెక్నాలజీ విభాగానికి అవసరమైన హై ప్రెసిషన్ ఉత్పత్తులు తయారవుతాయన్నారు. కొత్తగా 230 హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కి ఉపాది లభిస్తుండగా తయారీ రంగంలో మేడ్ ఇన్ తెలంగాణ మరింత విశ్వవ్యాప్త మవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకన్నగారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన గ్రామస్తులు
మంత్రి శ్రీధర్బాబును సర్పంచ్ ముత్యంరెడ్డితో పాటు గ్రామస్తులు కలసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కొండపోచమ్మ సాగర్ భూనిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటుకు, పరిశ్రమలు నెలకొల్పేందుకు గత ప్రభుత్వం తమ గ్రామస్తుల నుంచి 7 వందల ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమలకు ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటుకు అప్పగించిందన్నారు. పరిహారంలో భాగంగా ఇంటి స్థలాలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు కేటాయించలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని, అలాగే యువతకు పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం మంత్రిని గ్రామ నాయకులు సత్కరించారు.


