కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. నాలుగు మున్సిపాలిటీల్లో జరిగిన కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణ పరిధిలోని వెస్లీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నందున అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించి శాంతిభద్రతలను పరిరక్షించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. అంతకు ముందు కౌంటింగ్ ఏర్పాట్లను అదనపు ఎస్పీ మహేందర్ అధికారులతో కలిసి పరిశీలించారు.


