మెతుకుసీమలో హంగ్ రాజకీయం ఆసక్తికరం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: హంగ్ ఫలితాలు వచ్చిన బల్దియాల్లో రాజకీయం రంజుగా మారింది. ఆయా మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అవసరమైన మ్యా జిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుండటంతో ఆయా బల్దియాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సాపూర్లో 15 స్థానాల్లో ఐదు స్థానాలను సాధించిన బీఆర్ఎస్ మ్యాజిక్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో పాటు, ఆ పార్టీ ఎమ్మెల్సీల ఎక్స్ అఫీషియో ఓట్లతో ఈ చైర్మన్ పీఠాన్ని సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నాలుగు సీట్లు ఉన్న బీజేపీ ఇక్కడ కీలకంగా మారింది. ఆరు స్థానాలు కాంగ్రెస్ గెలిచినప్పటికీ, ఎక్స్అఫీషియో సభ్యుల బలం లేకపోవడం కాంగ్రెస్ మైనస్గా మారింది. మెదక్లో 32 స్థానాలకు కాంగ్రెస్ 14 గెలుచుకుంది. బీఆర్ఎస్ 15 సాధించింది. బీఎస్పీ నుంచి గెలిచిన అభ్యర్థిని కాంగ్రెస్లో చేర్చుకోవడంతో ఈ రెండు పార్టీల బలం సమానం అయ్యాయి. ఇక్కడ బీజేపీ రెండు స్థానాలతో పాటు, ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి.
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతర దగ్గర పడుతుంది, పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారంటూ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారం జాతర ఏర్పా ట్లను పరిశీలించారు. తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్, దర్శన ఏర్పాట్లు, సాంసృతిక కార్యక్రమాలు టాయిలెట్స్, బారికేడ్లను పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జాతరకు 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతం చేయాలని ఆదేశించారు. ఆయ న వెంట ఈఓ వీరేశం, సిబ్బంది పోలీసులు ఉన్నారు.
పెద్దశంకరంపేట(మెదక్)/హవేళిఘణాపూర్: మండల పరిధిలోని జంబికుంట, రామోజీపల్లి, బూర్గుపల్లి, పెద్దశంకరంపేట సబ్స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్యాంసుందర్ తెలిపారు. అలాగే మెదక్ మండలం మంభోజిపల్లి సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా దాని పరిధిలోని గ్రామాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ మోహన్బాబు తెలిపారు.
మెదక్కలెక్టరేట్: విద్యార్థులు చట్టాలపై అవగాహన అవసరమని భరోసా కో ఆర్డినేటర్ సౌమ్య సూచించారు. శుక్రవారం పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో భరోసా సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం, మొబైల్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాజంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలను ఉదాహరణలతో తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం విజయ శ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గురుకులం.. కోలాహలం
వర్గల్(గజ్వేల్): వార్షికోత్సవ సంరంభంతో వర్గల్ పూలే బాలికల గురుకులం అలరారింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గురుకులంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక జ్యోతిబాపూలే బీసీ బాలికల స్కూల్, జూనియర్ కళాశాలలో గురువారం రాత్రి ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. వార్షికోత్సవ సంరంభానికి బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బీ సైదులు, ఐఆర్ఎస్ అధికారి శోభన్బాబు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మెదక్ ఆర్సీఓ రాజేశం, నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్, ఆతిథ్య గురుకుల ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ‘రామాయణం’ నాటక ప్రదర్శనతో చిన్నారులు ఆకట్టుకున్నారు. అతిథుల ప్రశంసలు చూరగొన్నారు.


