మల్లన్న హుండీ ఆదాయం రూ.90లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయ 21 రోజుల హుండీ ఆదాయం రూ.90 లక్షలకు పైగా వచ్చినట్లు కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్ తెలిపారు. గురువారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో హుండీలలోని కానుకలను దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో లెక్కించారు. నగదు రూ.90,42,186, మి శ్రమ బంగారం 047 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోలు వచ్చినట్లు అధికారి తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గంగం నర్సింహారెడ్డి, సార్ల లింగం, ఎల్లయ్య, మల్లేశం,వరలక్ష్మి నాగరాజు ఆలయ ఏఈఓలు శ్రీనివాస్, ఆర్. సుదర్శన్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు చంద్రశేఖర్, స్వర్ణకారుడు నర్సింహచారి, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగి చేతివాటం
కానుకలను లెక్కిస్తున్న సమయంలో ఓ ఆలయ ఉద్యోగి చేతివాటం చూపించారు. రూ.500 నోట్లను చాటుగా దాచాడు. అది గమనించిన హోంగార్డు తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది. ఈఓ వెంకటేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆలయంలో ప్లంబర్గా విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగి సార్ల విజయ్కుమార్.. కానుకులను లెక్కిస్తున్న ఇద్దరి మహిళలనుంచి అధికారులకు ఇస్తానని చెప్పి రూ.500 నోట్లు 18 తీసుకుని చాటుగా అండర్వేర్లో ఉంచారు. హోంగార్డు శ్రీనివాస్ గమనించి అతనిని బాత్రూంలోకి తీసుకువెళ్లి చెక్చేశారు. దీంతో అతని వద్ద రూ.9 వేలు లభించాయి. వెంటనే ఆలయ అధికారులు సీసీ కెమెరాను పరిశీలించి అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈఓ తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. గతంలో కూడా ఈ ఉద్యోగి చోరికి పాల్పడగా.. పలు కేసులు నమోదయ్యాయి.


