
వడగండ్లు.. కడగండ్లు
మెదక్జోన్: వడగండ్ల వర్షం రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఈనెల 17, 18 తేదీల్లో శివ్వంపేట, నర్సాపూర్, పెద్దశంకరంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, చేగుంట తదితర మండలాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సుమారు 19 వందల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో వరి 1,860 ఎకరాలు ఉండగా, 40 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఆయా మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత రైతులు, పంటల వివరాలను సేకరించారు. రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికను అందజేశారు.
గతేడాది 794 ఎకరాల్లో నష్టం
గతేడాది యాసంగిలో కురిసిన వడగండ్ల వానకు 794 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అయితే గత మార్చిలో దెబ్బతిన్న 714 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఎకరాకు రూ. 10 వేల చొప్పున అందజేసింది. ఏప్రిల్, మేలో దెబ్బతిన్న 80 ఎకరాలకు సంబంధించి ఇప్పటివరకు రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు.
ఫసల్ బీమా ఎప్పుడో..?
పంట నష్టం జరిగినప్పుడు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెటింది. కాగా 2014 నుంచి రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయలేదు. దీంతో పంట నష్టం జరిగినప్పుడు బాధిత రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ పేరుతో పరిహారం మాత్రమే అందించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపద సమయంలో అన్నదాతలను ఆదుకునేందుకు ఫస ల్ బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రీమియం మొత్తంలో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. కేవలం 25 శాతం మాత్రమే రైతు వాటా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తే రైతులకు కొండంత అండగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
జిల్లాలో 1,860 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
40 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం
ప్రభుత్వానికి నివేదిక అందించిన అధికారులు

వడగండ్లు.. కడగండ్లు